ఎస్పీజీ తొలగింపు ఎఫెక్ట్: కాంగ్రెస్ నిరసన, అమిత్ షా నివాసం వద్ద ఉద్రిక్తత

By sivanagaprasad KodatiFirst Published Nov 8, 2019, 6:54 PM IST
Highlights

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తగ్గించడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తగ్గించడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి.

భారీ ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి.. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలు మోహరించాయి. 

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సహా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా జడ్‌ప్లస్ క్యాటగిరీ భద్రతను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.

Also read:సోనియా కుటుంబానికి మోడీ షాక్: ఎస్పీజీ భద్రత తొలగింపు

దీనికి సంబంధించి ఎస్పీజీ చట్టాన్ని సవరించేందుకు మోడీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ మాత్రమే ఎస్పీజీ సెక్యూరిటీ కలిగివున్న వ్యక్తిగా నిలవనున్నారు.

1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని సొంత అంగరక్షకులే కాల్చి చంపడంతో.. 1985లో నాటి రాజీవ్ సర్కార్ ఎస్పీజీని ఏర్పాటు చేసింది. 1991లో రాజీవ్ గాంధీ దారుణహత్య జరిగిన నాటి నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీజీ స్థాయి భద్రతను కల్పిస్తున్నారు. ఈ ప్రత్యేక దళంలో సుశిక్షితులైన 3 వేలమంది సిబ్బంది పనిచేస్తున్నారు.

Also Read:మౌనమునికి మోడీ షాక్: మన్మోహన్‌కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ

మనదేశంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంకలకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంది. ఎస్పీజీ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి.. అవసరం లేనప్పుడు ఆ భద్రతను తొలగిస్తుంది.

ప్రస్తుతానికి గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ముప్పు లేదని నిఘా వర్గాల ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్పీజీ భద్రతను తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా గత ఆగస్టు నెలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు. కాగా.. జడ్‌ప్లస్ సెక్యూరిటీ కింద గాంధీ కుటుంబానికి 100 మంది సీఆర్‌పీఎఫ్ భద్రతా సిబ్బందిని కేటాయించే అవకాశం ఉంది. 

click me!