ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు: కంగనాపై పోలీసులకు ఫిర్యాదు

By telugu teamFirst Published Sep 10, 2020, 3:07 PM IST
Highlights

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె విడుదల చేసిన వీడియో ఆధారంగా ఆ ఫిర్యాదు చేశారు.

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంగనాపై ముంబైలోని విఖ్రోలీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. కంగనా భవనాన్ని బీఎంసీ కూల్చివేసిన ఘటనలో ముఖ్యమంత్రికి ప్రత్యక్ష సంబంధం లేదని, అయినప్పటికీ సీఎం ఉద్ధవ్ థాకరే ప్రతిష్టను దెబ్బ తీయడానికి తన సోషల్ మీడియాలోని వీడియోల ద్వారా కంగనా ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో అన్నారు. 

బాలీవుడ్ మాఫియాతో ఉద్ధవ్ థాకరేకు సంబంధాలున్నాయని కంగనా ఆరోపించారు.  పాలిహిల్ కార్యాలయం భవనంలోని అక్రమ కట్టడాలను బీఎంసీ కూల్చివేసిన తర్వాత కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోను ట్టిట్టర్ ద్వారా విడుదల చేశారు.

Also Read: ముంబై చేరిన కంగనా: 'మహా' సీఎం ఉద్ధవ్ థాకరేపై తీవ్ర వ్యాఖ్యలు

ఇదిలావుంటే, శివసేనపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన మాటల యుద్ధాన్ని సాగిస్తూనే ఉంది. తాజాగా ఆమె శివసేనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం బాలససాహెబ్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి శివసేన సోనియా సేనగా మారేందుకు సిద్ధపడిందని ఆమె అన్నారు. 

ముంబైలోని పాలీ హిల్ లో గల కొన్ని అక్రమ నిర్మాణాలను బృహణ్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కూల్చడంతో కంగనాకు, శివసేనకు మధ్య వివాదం ముదిరింది. కూల్చివేతల తర్వాత బీఎంసీ అధికారులపై కూడా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఎంసీ అధికారులను గూండాలుగా అభివర్ణించారు. 

Also Read: కరణ్, ఉద్దవ్... వచ్చి నా శరీరాన్ని కూడా ఛిద్రం చేయండి..!

బీఎంసీ అధికారులను గూండాలుగా అభివర్ణిస్తూ వారిని తాను నగర పాలక సంస్థ అధికారులుగా పిలువబోనని అన్నారు. శివసేనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ - మీ తండ్రి మంచి పనులు మీకు సంపదను ఇచ్చి ఉంటాయి, కానీ గౌరవం మాత్రం మీ అంతట మీరే సంపాదించుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

మీరు ఎందరి నోళ్లు మూయిస్తారని ఆమె ప్రశ్నించారు. ఎన్ని గొంతుకలను అణిచివేస్తారని అడిగారు. వాస్తవాల నుంచి ఎన్ని రోజులు పారిపోతారని అడిగారు.

click me!