
Diwali Gift : దీపావళికి ముందే ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలనే కలను నిజం చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని పామ్ ప్యారడైజ్, దేవరియా బైపాస్లో ఉన్న హై-రైజ్ బిల్డింగ్లో 160 కుటుంబాలకు EWS/LIG కేటగిరీ ఫ్లాట్ల తాళాలను అందజేశారు. దాంతో పాటు 118 కోట్ల రూపాయల విలువైన 50 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… “ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనేది ఒక కల. ఈ రోజు దీపావళి శుభ సందర్భంగా 160 కుటుంబాల కల నెరవేరింది. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, జీవిత దిశను మార్చే చారిత్రాత్మక విజయం” అని అన్నారు.
ఫ్లాట్ల పంపిణీ పూర్తిగా పారదర్శక ప్రక్రియ ద్వారా జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. జీడీఏ హౌసింగ్ స్కీమ్లో 40 నిర్వాసిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చారు… మిగిలిన 120 కుటుంబాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారని తెలిపారు. EWS ఫ్లాట్లు 35 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని, వీటి మార్కెట్ విలువ 13-15 లక్షల రూపాయలు కాగా కేవలం 5.40 లక్షల రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు. అలాగే, 41 చదరపు మీటర్ల LIG ఫ్లాట్లను 10.80 లక్షల రూపాయలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఉన్నప్పుడు, పేదలకు ఇళ్లు అందించడంలో ఎలాంటి ఆటంకాలు రావని యోగి అన్నారు.
సీఎం యోగి ఇళ్ల లొకేషన్, నిర్మాణాన్ని ప్రశంసిస్తూ… “రామ్గఢ్ తాల్, జూ దగ్గర ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. ఇక్కడి హై-రైజ్ బిల్డింగ్లో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి” అని అన్నారు. లిఫ్ట్, ఇతర సౌకర్యాల రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం భవనాల నిర్వహణకు రెసిడెన్షియల్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన జీడీఏను ఆదేశించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మాఫియాలు ఆక్రమించుకున్న భూములపై పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నాం” అని అన్నారు. గతేడాది ప్రయాగ్రాజ్లో మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో 76 ఫ్లాట్లను పేదలకు ఇచ్చామని, లక్నోలో కూడా ఇదే మోడల్లో నిర్మాణం జరుగుతోందని తెలిపారు. “ఇకపై రాష్ట్రంలో మాఫియా భవనాల స్థానంలో పేదల కోసం ఇళ్లు నిర్మిస్తాం” అని ఆయన జోడించారు.
పీఎం ఆవాస్ యోజన, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఉత్తరప్రదేశ్లో 60 లక్షలకు పైగా కుటుంబాలకు ఇళ్లు అందాయని సీఎం చెప్పారు. “సంకల్పం స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఫలితాలు కూడా ప్రజా సంక్షేమానికి అనుకూలంగా ఉంటాయి. మంచి ప్రభుత్వాలు ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తాయి” అని సీఎం అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కమలేష్ పాశ్వాన్, ఎంపీ రవి కిషన్ శుక్లా, మేయర్ డా. మంగ్లేష్ శ్రీవాస్తవ, జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు సాధనా సింగ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.