పుస్తకంలో రాహుల్, మన్మోహన్‌ల ప్రస్తావన: ఒబామాపై యూపీలో కేసు

By Siva KodatiFirst Published Nov 19, 2020, 5:54 PM IST
Highlights

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత్‌లో సివిల్ కేసు నమోదైంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లను అవమానించారంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన జ్ఞాన్‌ ప్రకాశ్‌ శుక్లా ఈ కేసు వేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత్‌లో సివిల్ కేసు నమోదైంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లను అవమానించారంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన జ్ఞాన్‌ ప్రకాశ్‌ శుక్లా ఈ కేసు వేశారు.

ఆయన ఆల్‌ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు. మరోవైపు ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పేరుతో ఒబామా రాసిన పుస్తకంలో రాహుల్, మన్మోహన్ గురించి ప్రస్తావించారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ..లాల్‌గంజ్‌ సివిల్ కోర్టులో జ్ఞాన్ ప్రకాశ్ కేసు దాఖలు చేశారు.

ఆ పుస్తకానికి వ్యతిరేకంగా అభిమానులు వీధుల్లోకి వస్తే, ఘర్షణలు జరిగే అవకాశం ఉందని..అందుకే ఒబామాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు. కేసు నమోదు చేయకపోతే యూఎస్ ఎంబసీ ముందు నిరాహార దీక్ష చేస్తానని శుక్లా పోలీసులను హెచ్చరించారు.   

కాగా తన కుమారుడు రాహుల్ గాంధీకి ఎటువంటి అడ్డంకి కలిగించరనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ .. మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిగా చేశారని ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు. అలాగే ఆ పదవిని కట్టబెట్టినందుకు మన్మోహన్ సింగ్ ఆమెకు రుణపడి ఉన్నారని తెలిపారు.

మరోవైపు, రాహుల్‌ గురించి చెప్తూ..పని పూర్తి చేసి ఉపాధ్యాయుడి మెప్పును పొందాలని ఆరాటపడే విద్యార్థిలా ఉంటారే తప్ప ప్రావీణ్యం సంపాదించాలనే తపన కనిపించదని విమర్శనాత్మకంగా రాసుకొచ్చారు ఒబామా. కాగా, ఈ పుస్తకం నవంబర్ 17న మార్కెట్లో విడుదలైంది.    

click me!