వెంటాడుతున్న ఐఎన్ఎక్స్ కేసు: చిదంబరానికి ఢిల్లీ కోర్టు నోటీసులు

By Siva KodatiFirst Published Mar 24, 2021, 5:43 PM IST
Highlights

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసు వదలడం లేదు. తాజాగా ఈ కేసులో వారిద్దరు సహా, ఐఎన్‌ఎక్స్ మీడియా మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారు, మరికొంత మందికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసు వదలడం లేదు. తాజాగా ఈ కేసులో వారిద్దరు సహా, ఐఎన్‌ఎక్స్ మీడియా మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారు, మరికొంత మందికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అందించిన చార్జ్‌షీట్ పరిశీలించిన న్యాయస్థానం... నిందితులందరినీ ఏప్రిల్ 7న తమ ఎదుట హాజరు కావాలని ధర్మాసనం పేర్కొంది.

కాగా, ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరం సహా పలువురు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్‌కు లబ్ధి చేకూర్చడానికి విదేశీ పెట్టుబడులను ఆమోదించిన ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఈడీ ఆరోపించింది.

ఈ కంపెనీకి పెట్టుబడులు ఆమోదించిన సమయంలో కార్తీ తండ్రి చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ తెలిపింది.

అయితే ఐఎన్ఎక్స్‌పై 2017 మే 15న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు వ్యక్తులను ఇందులో నిందితులుగా పేర్కొంది. అయితే ఈ జాబితాలో చిదంబరం పేరు లేకపోవడం గమనార్హం. 

click me!