
Union Home Minister Amit Shah: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మరాఠా యోధుడుకి సంబంధించిన భారీ స్మారక చిహ్నమైన శివశ్రుష్ఠి మొదటి దశ థీమ్ పార్కును ప్రారంభించారు. శివశ్రుష్ఠి థీమ్ పార్కు ప్రారంభానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదనీ, దేశానికి, మతానికి, స్వరాజ్యానికి ఛత్రపతి శివాజీ చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. మహారాష్ట్రలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ "మరాఠా సామ్రాజ్య చరిత్రకు అంకితం చేయబడిన ఆసియాలో అతిపెద్ద థీమ్ పార్క్ అవుతుంది" అని షా అన్నారు. రూ.60 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తికాగా, రాష్ట్ర ప్రభుత్వం దీనికి రూ.50 కోట్లను విరాళంగా ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక పేరు మాత్రమే కాదనీ, ఒక భావజాలము, ప్రత్యేక సిద్ధాంతమని అన్నారు. ఆయన స్ఫూర్తిదాయక జీవిత చరిత్ర తరతరాలకు తన భాషను, మతాన్ని సగర్వంగా బోధించిందనీ, తన నైతిక విధులను నిర్వర్తించడంలో, స్వరాజ్యాన్న కాపాడుకోవడంలో ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలని స్పూర్తినిస్తుందని తెలిపారు. ఛత్రపతి శివాజీపై రచనలకు ప్రసిద్ధి చెందిన రచయిత, కవి బాబాసాహెబ్ పురందరే కలలను సాకారం చేయడానికి ఈ థీమ్ పార్క్ దోహదపడుతుందని ఆయన అన్నారు. థీమ్ పార్కులో హోలోగ్రఫీ, ప్రాజెక్ట్ మ్యాపింగ్, మినియేచర్ మోషన్ సిమ్యులేషన్, 3డీ-4డీ టెక్నిక్, లైట్ అండ్ సౌండ్ టెక్నిక్ ఉంటాయి. ఇవన్నీ చరిత్రను పునరుజ్జీవింపజేస్తాయని, మహారాష్ట్ర ప్రజలనే కాకుండా యావత్ దేశానికి స్పూర్తినిస్తాయని అన్నారు.
"స్వరాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర పవిత్ర గ్రంథాన్ని పోలి ఉంటుంది. శివ పాత్రకు అంకితమైన శివ-షాహిర్ బాబాసాహెబ్ పురందరే గారి ఉపన్యాసాల ఆధారంగా, శివాజీ ధైర్యసాహసాల జీవిత కథలను చిత్రీకరించే 'శివశ్రుష్ఠి' థీమ్ పార్కు మొదటి దశను ఈ రోజు ప్రారంభించారు" అని అమిత్ షా ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.