
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్ఖైదా ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్లలో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా హెచ్చరించింది. అల్ఖైదా నుంచి ఇటువంటి లేఖ విడుదలైన నేపథ్యంలో భారత నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. అల్ఖైదా హెచ్చరికలను తీవ్రంగా పరిశీలిస్తున్నామని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. విమానాశ్రయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లు , మార్కెట్ ప్రాంతాలు.. వంటి నిర్దిష్ట ప్రదేశాలలో నిఘాను కఠినతరం చేశాయి.
ఆయా ప్రాంతాల్లో నిఘాను కఠినతరం చేయడానికి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అంతటా హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ‘‘ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే.. వెంటనే సంబంధిత విభాగానికి నివేదించాలని భద్రతా సిబ్బందికి సూచించడం జరిగింది’’ అని ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి.
అసలేం జరిగింది..
మహ్మద్ ప్రవక్తపై కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. ఒక టీవీ చర్చలో నూపుర్ శర్మ వ్యాఖ్యలు చేయగా, మరో నాయకుడు నవీన్ జిందాల్ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యను పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా పలు దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. బీజేపీ నూపుర్ శర్మను సస్పెండ్ చేసింది. నవీన్ జిందాల్ను బహిష్కరించింది.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే చాలా వరకు అరబ్ దేశాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. ఖతర్, ఇరాన్, కువైట్ దేశాలైతే భారత దౌత్య కార్యాలయాలకు ఆదివారం సమన్లు పంపి మరీ నిరసన వ్యక్తం చేశాయి. ముస్లిం దేశాలు ఒక దాని వెనుక మరొకటి నుపుర్ శర్మ కామెంట్లను విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే జూలై 6వ తేదీన విడుదల చేసిన లేఖలో.. ‘‘ప్రవక్త గౌరవం కోసం పోరాడటానికి’’ ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్లలో ఆత్మాహుతి దాడులు చేయనున్నట్లు అల్ ఖైదా పేర్కొంది.
‘‘మా ప్రవక్తను అవమానించేవారిని మేము చంపుతాము. మా ప్రవక్తను అవమానపరచడానికి ధైర్యం చేసే వారిని అంతం చేయడానికి శరీరాలకు పేలుడు పదార్థాలను బిగించిన ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించుతాం. మా పిల్లలను సైతం ఇందుకు వినియోగిస్తాం’’ అని అల్ ఖైదా పేర్కొంది.