రేపు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్లు.. కేంద్ర జల్‌శక్తి శాఖ కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Jul 15, 2021, 9:20 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తారాస్థాయికి చేరుకోవడం.. నిత్యం ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం, కేంద్రానికి ఫిర్యాదుల  నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై జల్‌శక్తి శాఖ రేపు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 
 

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జల్‌శక్తి శాఖ రేపు గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో గెజిట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రం గెజిట్లు విడుదల చేయనున్నట్టు సమాచారం. గెజిట్లలో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అంశాలు పొందుపర్చారు.  

2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉన్నా ఏడేళ్లపాటు కాలయాపన జరిగింది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధి నిర్దేశించేందుకు 2020 అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల్‌శక్తి మంత్రితో కూడిన అపెక్స్‌ కమిటీ సమావేశమైనప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు.

Also Read:శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో విద్యుత్ ఉత్పత్తిని ఆపేయండి: తెలంగాణకు కేఆర్ఎంబీ ఆదేశం

పునర్విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిధి నిర్దేశించే అధికారం కేంద్రానికి ఉంటుందని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తారాస్థాయికి చేరుకోవడం.. నిత్యం ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం, కేంద్రానికి ఫిర్యాదుల  నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై జల్‌శక్తి శాఖ రేపు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 

click me!