
నీరవ్ మోడీ (nirav modi) , విజయ్ మాల్యా (vijay mallya), మొహుల్ చోక్సీ (mehul choksi) కోవలోనే దేశంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నౌకల తయారీ రంగంలో వున్న ఏబీజీ షిప్యార్డ్ (abg shipyard) దేశంలోని పలు బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసగించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం 28 బ్యాంకులను ఏబీజీ షిప్యార్డ్ మోసం చేసినట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.2,925కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.7,089కోట్లు, ఐడీబీఐ బ్యాంక్కు రూ.3,634కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1,614కోట్లు, పీఎన్బీ బ్యాంక్కు రూ.1,244కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కు రూ.1,228 కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు ఎస్బీఐ తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ కేసులో కంపెనీ డైరెక్టర్లు రిషి అగర్వాల్, శంతనం ముత్తుస్వామి, అశ్విని కుమార్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి కంపెనీ యాజమాన్యం రుణాలు తీసుకుని నిధులను దారి మళ్లించడం, నిధుల దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడ్డారని సీబీఐ (cbi) ఎఫ్ఐఆర్లో పేర్కొనట్లు జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్ సంస్థ నౌకల తయారీ, మరమ్మతులు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి గుజరాత్లోని సూరత్, దహేజ్లలో యార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సంస్థ 165 నౌకలను నిర్మించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. గతంలోనూ ఈ కంపెనీపై రుణాల ఎగవేత ఆరోపణలు రావడం గమనార్హం.