
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయినా ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీ ప్రజలనుద్దేశించి ప్రసగించారు. ఈ ప్రసంగంలో ఆయన కరోనా కేసులపైనే ప్రధానంగా మాట్లాడారు. దేశ రాజధానిలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నా హాస్పిటల్లో చేరే వారి సంఖ్య పెరగడం లేదని అన్నారు. ఎవరూ భయపడాల్సిన పరిస్థితి లేదని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 3,100 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6,360. చేరుకుందని అన్నారు. అయితే శనివారం రోజు నాటికి హాస్పిటల్ లో కేవలం 246 మంది మాత్రమే చేరారని తెలిపారు. వారిలో చాలా మంది లక్షణాలు లేకుండా ఉన్నారని, మరి కొందరు స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు.
New Year 2022 Eve: డ్రంకెన్ డ్రైవ్... హైద్రాబాద్లో 2500 మందిపై కేసు
రెండో వేవ్ లో కేసులు పెరిగిన దానికంటే ఎప్పుడు చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఢిల్లీ సీఎం చెప్పారు. హాస్పిటల్స్ లో చేరిన వారిలో 86 మంది మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉన్న బెడ్స్ పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం 37,000 బెడ్స్ సిద్ధంగా ఉంచిందని అన్నారు. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మందికి ఎలాంటి లక్షణాలు లేవని, మరి కొంత మందికి తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తాను స్పష్టం చేస్తున్నాని తెలిపారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందొద్దు అని అన్నారు. అయితే డిసెంబర్ 29వ తేదీ నాటికి దాదాపు 2,000 యాక్టివ్ కేసులు ఉంటే అవి జనవరి 1వ తేదీ నాటికి 6,000కి పెరిగాయని అన్నారు. కాబట్టి ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తప్పకుండా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. శానిటైజేషన్ చేసుకోవడం మర్చిపోవద్దని తెలిపారు.
ఆన్లైన్ లో అమ్మకానికి అమ్మాయిలు.. యాప్లో ఓ వర్గం వారి ఫొటోలు.. సర్వత్రా ఆగ్రహం !
ఢిల్లీలో భారీగా పెరుగుతున్న కేసులు..
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కేసుల పెరుగుదలలో వేగం కనిపిస్తోంది. కరోనా కేసుల్లో మహారాష్ట్ర తరువాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా భారీగానే ఉన్నాయి. తాజాగా శనివారం ఒకే రోజు 2,716 కేసులు నమోదయ్యాయి. మే 21 తరువాత ఇంత ఎక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. శుక్రవారం నాటి కంటే శనివారం నాడు 51 శాతం కేసులు పెరిగాయి. అయితే హాస్పిటల్ లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని, కొన్ని రోజుల తరువాత ఆంక్షలను సమీక్షిస్తామని హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ తెలిపారు.
ఒకే రోజులో 351 ఒమిక్రాన్ కేసులు..
కోవిడ్ -19 డెల్టా వేరియంట్ తో పాటు కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ కేసులు కూడా ఢిల్లీలో అధికంగానే నమోదవుతున్నాయి. శనివారం ఒక్క రోజే 351 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 460 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. జన సాంద్రత అధికంగా ఉన్న న్యూఢిల్లీ, ముంబై, కొల్కత్త వంటి మెట్రో నగరాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.