
కెనడాకు చెందిన పంజాబీ గాయకుడు శుభ్.. ముంబైలో నిర్వహించాల్సిన కచేరీ రద్దయ్యింది. ఖలిస్తాన్ సానుభూతిపరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శుభ్.. గతంలో సోషల్ మీడియాలో పోస్టుల్లో వేర్పాటువాదానికి మద్ధతు ఇచ్చాడనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శుభ్ ముంబైలో నిర్వహించాల్సిన కచేరీ రద్దయ్యింది. దీని కోసం టికెట్లు కొనుగోలు చేసిన వారందరికీ బుక్ మై షో .. నగదును రిఫండ్ చేస్తోంది.
ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ ప్రకటన వచ్చింది. బీజేపీ యువజన విభాగమైన భారతీయ జనతా యువమోర్చా శుభ్ కచేరీని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అటు ఈ షోకు స్పాన్సర్ చేస్తున్న భారతీయ కంపెనీ boAt కూడా .. స్పాన్సర్షిప్ను ఉపసంహరించుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
ALso Read: నిజ్జర్ హత్య .. ట్రూడో వ్యాఖ్యల ప్రకంపనలు : ప్రధాని మోడీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ
కెనడాతో ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియా మ్యాప్ను వక్రీకరించినందుకు గాను శుభ్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలను భారత్లో భాగంగా చూపకుండా వున్న మ్యాప్ను శుభ్ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఇన్స్టాగ్రామ్లో శుభ్ను అన్ ఫాలో చేశారు. పంజాబ్లోనే జన్మించిన శుభ్.. అనంతర కాలంలో కెనడాకు వలస వెళ్లాడు. పాటలు పాడటంతో పాటు ర్యాపింగ్, మ్యూజిక్ కంపోజింగ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. సంగీత పరిశ్రమలో సుపరిచితుడైన రవ్నీత్ సింగ్కి శుభనీత్ తమ్ముడు