కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సభలో దివ్యాంగుడుపై చిందులేశారు. దివ్యాంగుడిని పట్టుకుని కాళ్లు విరగ్గొడతారనని బెదిరింపులకు పాల్పడ్డారు.
కోల్కతా: కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సభలో దివ్యాంగుడుపై చిందులేశారు. దివ్యాంగుడిని పట్టుకుని కాళ్లు విరగ్గొడతారనని బెదిరింపులకు పాల్పడ్డారు. పశ్చిమ్ బంగాలోని అసాన్సోల్ లో ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
దివ్యాంగులకు చక్రాల కుర్చీలు, ఇతర పరికరాలు పంచేందుకు కేంద్రమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాబుల్ సుప్రియో ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న ఓ దివ్యాంగుడు నెమ్మదిగా లేస్తుండగా అతన్ని గమనించిన బాబుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళుతున్నారు...దయచేసి కూర్చోండి అన్నారు.
అయితే ఆ దివ్యాంగుడు బాబూల్ మాట్లాడున్నంత సేపు ఒకే చోట కూర్చోలేక అటూ ఇటూ కదులుతూనే ఉన్నాడు. దీంతో కేంద్రమంత్రికి చిర్రెత్తుకొచ్చింది. తన కోపాన్ని ఆపుకోలేక నీకేమైంది...ఏదైనా సమస్య ఉందా....కాలు విరగొట్టి చేతికర్రలు కానుకగా ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు.
వార్నింగ్ తో సరిపెట్టెయ్యలేదు. అక్కడే ఉన్న తన సెక్యూరిటీ గార్డును పిలిపించి ఇంకోసారి ఆ వ్యక్తి కదిలితే కాలు విరగ్గొట్టి చేతి కర్రలు ఇవ్వు అని ఆర్డర్ వేశారు. దివ్యాంగుల కార్యక్రమానికి హాజరై దివ్యాంగులు అని కూడా తెలిసి జాలిపడాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో బాబూల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అయితే కేంద్రమంత్రి బాబూల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారేం కాదు. మార్చిలో అసాన్సోల్ ప్రాంతంలో శ్రీరామ నవమి వేడుకల్లో మత కలహాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో బాబుల్ ఆందోళన కారుల వద్దకు వెళ్లి కేకలు వేస్తే చర్మం వలిచేస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.