
Body Of Girl, 2, Found Inside Bag: గ్రేటర్ నోయిడాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండేండ్ల బాలిక గతవారం కనిపించకుండా పోయింది. అయితే, బాలికను వెతుకుతున్నట్టు బాధితకుటుంబంతో ఉన్న పొరుగింటి వ్యక్తి బాలికను హత్య చేసినట్టు సమాచారం. పొరుగింటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు లోపలికి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. గ్రేటర్ నోయిడాలోని దేవ్లా ప్రాంతంలో శివకుమారు-మంజు దంపతులు నివాసముటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఒకరు రెండేండ్ల మాన్సీ, ఏడు నెలల చిన్నారి ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ దగ్గరలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తండ్రి శివకుమార్ పనికి వెళ్లగా, తల్లి మంజు శుక్రవారం మార్కెట్ కు వెళ్లి తిరిగి వచ్చేసరికి కూతురు మాన్సి కనిపించలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల తర్వాత శివ్ కుమార్ తన పక్కింటి రాఘవేంద్ర తాళం వేసిన ఇంటి నుంచి దుర్వాసన రావడం గమనించాడు. ఇదే విషయం పోలీసులకు చెప్పాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులు ఇంట్లో నివాసముంటున్న వారికి కాల్ చేయగా స్విచ్ ఆప్ ఆచ్చింది. దీంతో పోలీసులు బలవంతంగా తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. తలుపులకు పక్కన వేలాడుతున్న ఒక బ్యాగులో మాన్సీ మృతదేహాన్ని వారు గుర్తించారు. ఆమెను గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
గతంలో అత్యాచారం జరిగినట్లు అనుమానం వచ్చినా పోస్టుమార్టం రిపోర్టులో నిర్ధారణ కాలేదు. నిందితుడు పరారీలో ఉన్నాడు, కానీ పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ లోని బల్లియాకు చెందిన నిందితుడు రాఘవేంద్రను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు నోయిడా సీనియర్ పోలీసు అధికారి రాజీవ్ దీక్షిత్ చెప్పారు.