కర్ణాటక ఉప ఎన్నికలు: 12 చోట్ల బీజేపీ జయభేరీ, చేతులెత్తేసిన కాంగ్రెస్

By Siva KodatiFirst Published Dec 9, 2019, 3:27 PM IST
Highlights

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. మొత్తం 15 స్థానాల్లో 12 గెలుచుకుని తనకు ఎదురులేదని నిరూపించుకుంది

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. మొత్తం 15 స్థానాల్లో 12 గెలుచుకుని తనకు ఎదురులేదని నిరూపించుకుంది.

మరోవైపు, ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకోవాలని భావించిన కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. హస్తం పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచి చేతులేత్తేసింది. సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పిన జేడీఎస్ కనీసం బోణి చేయలేకపోయింది. మరో చోట స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించారు.

Also Read:కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్: ఫలితాలపై ఉత్కంఠ

గోఖక్, కాగవాడ, అథణి, యల్లాపుర, రాణేబెన్నూరు, హీరెకెరూరు, కేఆర్ పురం, మహాలక్ష్మీ లేఔట్, యశ్వంత్‌పూర్, విజయనగర, కేఆర్  పేట, చిక్కబళ్లాపూర్‌ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా పాతింది. హణసూరు, శివాజీ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

హోసకోటెలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన బీజేపీ రెబెల్ శరత్ కుమార్ గౌడ విజయం సాధించారు. ఈయన కూడా తిరిగి కమలం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.

Also Read:కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్: 12 చోట్ల బీజేపీ , 2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

ఈ క్రమంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై నాటి స్పీకర్ కేఆర్ సురేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. ఆ వ్యవహారంలో అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.... బలపరీక్షకు కోర్టు ఆదేశించింది.

మరోవైపు ఎమ్మెల్యేల అనర్హతతో 17 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. హైకోర్టులో న్యాయపరమైన చిక్కుల కారణంగా రెండు చోట్ల ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సభలో బీజేపీ బలం 105 కాగా.. తాజా ఉప ఎన్నికల్లో మరో 12 చోట్ల గెలుపొందడంతో ఆ పార్టీ బలం 117కు పెరిగింది. 

click me!