
loudspeaker, Hanuman Chalisa issues : ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రగులుతున్న లౌడ్ స్పీకర్ల వివాదం పై స్పందించారు. ఇది పూర్తిగా తప్పుని అన్నారు. " బహుత్ గలాత్.. ఇదంతా తప్పు మరియు దేశాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా ఉంది. మీరు మసీదు దగ్గరికి ఎందుకు వెళ్లాలి? మీరు హనుమాన్ చాలీసా చదవాలనుకుంటే రామమందిరానికి వెళ్లండి. ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి ఊసిగొల్పే చర్య. పలు ప్రాంతాల్లో అల్లర్లు, అశాంతి నెలకొని ఉంది" అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్ పై కూడా లాలు ప్రసాద్ యాదవ్ విమర్శలు గుప్పించారు. లౌడ్ స్పీకర్ల వివాదం.. హనుమాన్ చాలీసాపై ప్రజలను రెచ్చగొట్టేందుకు వారు (బీజేపీ, ఆరెస్సెస్ లు) ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దాణా కుంభకోణం కేసులో రాంచీ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసిన లాలూ ప్రసాద్ అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఆయన బుధవారం మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యి దేశ రాజధానిలోని తన కుమార్తె మిసా భారతి అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. “ఇది చాలా దురదృష్టకరం... దేశంలో తప్పుడు విషయాలు జరుగుతున్నాయి. ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలు ఇవి.. హనుమాన్ చాలీసా చదవడానికి మసీదుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మీరు హనుమాన్ చాలీసా చదవాలనుకుంటే, దేవాలయాలలో చదవండి. వారు (బీజేపీ, ఆరెస్సెస్) ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తులను దానికి ప్రతిస్పందించేలా ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా వారు అల్లర్లు సృష్టించబడతాయి. ఇలాంటి పరిస్థితి దేశానికి చాలా చేటు చేస్తుంది” అని లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు.
బీహార్లో నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకునే అవకాశంపై లాలూ ప్రసాద్ మాట్లాడుతూ.. తన ముందు అలాంటి రాజకీయ దృశ్యం కనిపించడం లేదని అన్నారు. నితీష్ కుమార్తో రహస్య చర్చలు జరిపినట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ చెప్పడంపై లాలూ ప్రసాద్ స్పందిస్తూ.. “తేజ్ ప్రతాప్ నా కొడుకు, నేనే పార్టీకి చీఫ్ కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటాను.. ఆయన కాదు” అని లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆరోగ్యంగా, ఆహ్లాదకరమైన మూడ్లో కనిపించిన లాలూ ప్రసాద్, ఒక వారం తర్వాత పాట్నా వెళ్తానని కూడా చెప్పారు.
కాగా, మహారాష్ట్ర రాజకీయాలను లౌడ్ స్పీకర్ల వివాదం కుదుపేస్తోంది. వెనక్కి తగ్గదేలే అంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే ముందుకు సాగుతున్నారు. మే 3 తర్వాత ఎలాంటి ఘటనలు జరిగినా తన బాధ్యత ఉండదనిరాజ్ థాక్రే హెచ్చరించారు. మసీదులపై లౌడ్ స్పీకర్లు, మైకుల తొలగింపునకు సంబంధించి ఆయన ఇచ్చిన గడువును మళ్లీ మళ్లీ గుర్తుచేస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే బుధవారం నుంచి మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో మసీదులపై లౌడ్ స్పీకర్లు, మైకులు ఆన్ చేసిన సమయంలో.. ఎంఎన్ఎస్ కు చెందిన కార్యకర్తలు లౌడ్ స్పీకర్లను మసీదుల ముందు పెట్టి.. హనుమాన్ చాలీసాను ప్లే చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశముండటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.