
Bihar Man Lynched On Suspicion Of Carrying Beef: గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిపై పలువురు వ్యక్తులతో కూడిన గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయారు. బీహార్ లో జరిగన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సర్పంచ్ సుశీల్ సింగ్, మరో ఇద్దరు రవి సాహ్, ఉజ్వల్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకెళ్తే.. బీహార్ లోని సివాన్ జిల్లాలో గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. హసన్ పూర్ గ్రామానికి చెందిన 56 ఏళ్ల నసీమ్ ఖురేషీ, అతని మేనల్లుడు ఫిరోజ్ అహ్మద్ ఖురేషీ పాట్నాకు వాయువ్యంగా 110 కిలోమీటర్ల దూరంలోని జోగియా గ్రామం వద్ద కొంతమంది పరిచయస్తులను కలిసేందుకు వెళ్తుండగా ఒక గుంపు వారిని అడ్డుకుంది. ఈ క్రమంలోనే వారిపై దాడిచేసిందని సరన్ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ మంగ్లా తెలిపారు.
వారిని మసీదు సమీపంలో గ్రామస్థులు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిరోజ్ ఖురేషీ తప్పించుకోగా, నజీమ్ ఖురేషీని కర్రలతో కొట్టారు. రసూల్పూర్ గ్రామంలో ఖురేషీని పోలీసులకు అప్పగించారనీ, ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. వారు గొడ్డు మాంసం తీసుకెళ్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక సర్పంచ్ సుశీల్ సింగ్, మరో ఇద్దరు రవి సాహ్, ఉజ్వల్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. మేనల్లుడు ఫిరోజ్ అహ్మద్ ఖురేషీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.