UttarPradesh: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరితో సహా పలువురు బీజేపీయేతర రాజకీయ నాయకులను భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ ఆహ్వానించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. త్వరలోనే ఉత్తప్రదేశ్ లోకి ప్రవేశించనుంది.
Congress Bharat Jodo Yatra: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పెద్దఎత్తున ప్రజలు ఈ దేశవ్యాప్త పాదయాత్రలో పాలుపంచుకుంటున్నారు. దేశరాజధాని ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలగుండా త్వరలోనే భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ లోని ప్రవేశించనుంది. అయితే, ఉత్తరప్రదేశ్ లో భారత్ జోడో యాత్రకు ముందు కాంగ్రెస్ భారీ ప్రణాళికలే రచించినట్టు తెలుస్తోంది. ఈ పాదయాత్రను రాష్ట్రంలో భారీ ఎత్తున నిర్వహించడంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గట్టిదెబ్బకొట్టే వ్యూహాలను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా భారత్ జోడో యాత్రలో పాలుపంచుకోవాలని రాష్ట్రంలోని సీనియర్ పొలిటికల్ లీడర్స్ కు స్వాగతం పలికింది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరితో సహా పలువురు బీజేపీయేతర రాజకీయ నాయకులను భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ ఆహ్వానించింది.
అయితే, ఇదే విషయంపై అఖిలేష్ యాదవ్ ను మీడియా ప్రశ్నించగా, ఇప్పటివరకు తనకు అలాంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. లక్నో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మను యాత్రకు ఆహ్వానించారు. మరో యూనివర్సిటీ ప్రొఫెసర్ రవికాంత్ ను కూడా ఆహ్వానించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఘజియాబాద్ సమీపంలోని లోనీ ద్వారా జనవరి 3 న ఉత్తరప్రదేశ్ కు చేరుకుంటుంది. ఆ తర్వాత బాగ్ పట్, షామ్లీ మీదుగా హర్యానాకు చేరుకుంటుంది. ఈ యాత్రలో పాల్గొనాలని రాష్ట్రంలోని కీలక ప్రతిపక్ష నేతలకు పార్టీ ఆహ్వానాలు పంపిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అనుమతించబడని నేటి ప్రపంచంలో, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ యాత్ర ఒక్కటే మార్గం అని ఆయన తెలిపారు. మొత్తం ప్రతిపక్షం ఈ పరిపాలన గురించి ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉంది, అందువల్ల వారిని యాత్రలో చేరమని కోరినట్లు చెప్పారు.
ఎస్పీ ఎమ్మెల్యే శివపాల్ సింగ్ యాదవ్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్ మిశ్రా, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్ భర్, సీపీఎం కార్యదర్శి అతుల్ అంజన్ తో పాటు అఖిలేష్ యాదవ్, మాయావతి, చౌదరిలను కాంగ్రెస్ ఆహ్వానించింది. భారత్ జోడో యాత్ర మొత్తం దేశానికి సంబంధించినదనీ, అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఇందులో పాల్గొనాలని కోరుతామని యాత్ర రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గత వారం విలేకరులతో అన్నారు. అయితే ఆహ్వానించబోయే నాయకుల పేర్లను అప్పుడు ఆయన వెల్లడించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. పది రాష్ట్రాల్లో 2,800 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన భారత్ జోడో యాత్ర.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనుంది. తొమ్మిది రోజుల శీతాకాల విరామం తీసుకొని జనవరి 3 నుంచి మళ్లీ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. కాగా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జమ్మూకాశ్మీర్ లో ముగుస్తుంది.