
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ ను.. 2 - 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిపై 2/3 ఫేజ్ ట్రయల్స్ నిర్వహించడానికి నిపుణుల కమిటీ అనుమతులు ఇచ్చింది.
పిటిఐ కథనం ప్రకారం ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన యాంటీ-కోవిడ్ వ్యాక్సిన్ను మంగళవారం రెండు నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిపై 2/3 ఫేజ్ క్లినికల్ ట్రయల్ కోసం నిపుణుల ప్యానెల్ (సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ) సిఫారసు చేసిందని తెలిపింది.
ఎయిమ్స్, ఢిల్లీ, పాట్నా, నాగ్పూర్లోని మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా వివిధ ప్రాంతాల్లోని 525 సబ్జెక్టుల్లో ఈ ట్రయల్ జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) లోని COVID-19 పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసి) మంగళవారం హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ దరఖాస్తుపై చర్చించి ఈ నిర్ణయానికి వచ్చింది.
అంతకు ముందు భారత్ బయోటెక్ రెండు నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిపై 2/3 ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ సేఫ్టీ, రియాక్టోజెనిసిటీ, ఇమ్యునోజెనిసిటీని అంచనా వేయడానికి అనుమతినివ్వమని దరఖాస్తు చేసుకుంది.
ఈ దరఖాస్తు మీద పూర్తి స్తాయిలో చర్చించిన తరువాత 2 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారిలో వైరియన్ క్రియారహితం చేసే కరోనా వ్యాక్సిన్ ప్రతిపాదిత 2/3 ఫేజ్ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి కమిటీ సిఫారసు చేసింది. అయితే అధ్యయనం మూడో ఫేజ్ కువెళ్ళే ముందు CDSCO కి DSMB సిఫారసులతో వెళ్లాలని తెలిపారని సమచారం.
అంతకుముందు ఫిబ్రవరి 24 నాటి ఎస్ఇసి సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే దీంట్లో కొన్ని సవరణలు చేసి క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ ప్రకారం సమర్పించాలని వారు సంస్థను కోరారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్, దేశంలో కొనసాగుతున్న COVID-19 టీకా డ్రైవ్లో పెద్దవారికి ఇస్తున్నారు.
COV తయారీదారులు మాట్లాడుతూ.. COVID-19 టీకా కోవాక్సిన్ ను సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూసుకుంటామని తెలిపారు. మే 1 నుండి ఈ వ్యాక్సిన్ నేరుగా 18 రాష్ట్రాలకు సరఫరా చేయబడుతోంది.
"మే 1 నుండి కోవాక్సిన్ 18 రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేస్తున్నాం. మా ప్రయత్న లోపం లేకుండా, వ్యాక్సిన్ సరఫరాలో అంతరాయం రాకుండా చూసుకుంటాం అని భారత్ బయోటెక్ ఒక ట్వీట్లో పేర్కొంది.
రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బీహార్, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ తెలిపింది.