కరోనా కాటు.. అమరవీరుడు భగత్ సింగ్ బంధువు కన్నుమూత..!

By telugu news teamFirst Published May 15, 2021, 7:29 AM IST
Highlights

అభయ్ సింగ్ సంధు... సర్దార్ కుల్బీర్ సింగ్ కుమారుడు. కుల్బీర్ సింగ్...  భగత్ సింగ్ తమ్ముడు. అభ‌య్‌సింగ్‌ మృతికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంతాపం తెలిపారు. 
 

కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. మరణాలు సైతం వేల సంఖ్యలో నమోదౌతున్నాయి. ఈ మహమ్మారి కాటుకి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా..  అమరవీరుడు భగత్ సింగ్ సోదరుడి కుమారుడు అభయ్ సింగ్ సంధు(63) క‌రోనాతో క‌న్నుమూశారు. 

కరోనా సోకిన అభయ్ సింగ్ సంధును మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్కడ చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. అభయ్ సింగ్ సంధు... సర్దార్ కుల్బీర్ సింగ్ కుమారుడు. కుల్బీర్ సింగ్...  భగత్ సింగ్ తమ్ముడు. అభ‌య్‌సింగ్‌ మృతికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంతాపం తెలిపారు. 

పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్  కూడా అభ‌య్‌సింగ్ మృతికి సంతాపం వెలిబుచ్చారు. కాగా గత 24 గంటల్లో పంజాబ్‌లో కొత్త‌గా 8,068 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో 8,446 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 180 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం పంజాబ్‌లో 79,359 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,477 మంది క‌రోనా కార‌ణంగా క‌న్నుమూశారు.

click me!