
బెంగుళూరు: నగరంలో ఆదివారంనాడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపోయాయి. భారీ వర్షం కారణంగా రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. నగరంలోని కేఆర్ అండర్ పాస్ వద్ద వర్షం నీటిలో కారు నిలిచిపోయింది. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిక్కుకున్నారు. వీరిలో నలుగురిని కారు నుండి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసింది. మరో ఇద్దరిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కుమారకృప రోడ్డులో చెట్టు విరిగిపడింది. దీంతో రోడ్డును మూసివేశారు. చిత్రకళాపరిషత్ ఎదుట చెట్టు కూలి బైక్, కారు ఢ్వంసమయ్యాయి.
ఈదురుగాలులతో పాటు నగరంలోని పలు చోట్ల వడగళ్లు కూడా కురిశాయి .,
ఇవాళ బెంగుళూరులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నాడు బెంగుళూరులో 30.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెల 25 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బెంగుళూరు రూరల్, చిక్ బళ్లాపూర్, కొడుగు, మాండ్య, మైసూరు, చిత్రదుర్గ ప్రాంతాల్లో ఈ నెల 25 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారీగా వర్షం నీరు నిలిచింది. నగరంలో భారీ వర్షాలపై సీఎం సిద్దరామయ్య అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.