
ప్రధాని నరేంద్ర మోడీతో పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి భేటీ అయ్యారు. ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింస, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ప్రధానికి ఆయన వివరించినట్టు సమాచారం. భయం గుప్పిట్లో బీజేపీ కార్యకర్తలు మనుగడ సాగిస్తున్నారని, పలువురు పార్టీ కార్యకర్తలు బెంగాల్ విడిచిపెట్టి అసోంలో తలదాచుకుంటున్నారని మోడీకి సువేందు వివరించారు.
సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన సువేందు బిజిబిజీగా గడుపుతున్నారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ను కూడా గతవారం ఆయన బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు అందజేశారు.
Also Read:టీకా సర్టిఫికెట్ రచ్చ : మోదీ ఫొటో స్థానంతో దీదీ ఫొటో..బీజేపీ మండిపాటు...!
బెంగాల్ హింసాకాండలో పలువురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనట్టు ఆ పార్టీ ఆరోపించగా, వీటిని అధికార తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. మే 2న బీజేపీ కార్యకర్తలుగా అనుమాస్తున్న ఇద్దరి హత్య కేసులో ప్రమేయంపై ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మే 25న తెలియజేసింది. దీంతో హింసాకాండ బాధితుల పునరావాసానికి త్రిసభ్య కమిటీని అత్యున్నత న్యాయస్థానం నియమించింది.
మరోవైపు మోడీ సమీక్షకు హాజరుకాలేదంటూ మాజీ సీఎస్ ఆలాపన్ బంధోపాధ్యాయ్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయనను వెంటనే రిలీవ్ చేసి తమకు అటాచ్ చేయాలంటూ డీవోపీటీ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దీనికి ససేమిరా అన్న మమత.. ఆలాపన్తో రాజీనామా చేయించి, తన ముఖ్య సలహదారుగా నియమించుకుని మోడీకి కౌంటరిచ్చారు. దీనిని సీరియస్గా తీసుకున్న కేంద్రం ఆలాపన్పై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.