
Karnataka: కర్ణాటకలో హిజాబ్ వివాదం మరిచిపోకముందే.. మరోవివాదం తెరమీదకు వచ్చింది. తాజాగా... ఆలయాల్లో, జాతరల్లో ముస్లిం వ్యాపారాల బహిష్కరించాలంటూ.. కొత్త ఆంశం ప్రబలింది. తొలుత ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాల్లో తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. మొదట్లో ఉడిపి జిల్లాలో ఏటా జరిగే కాపు మరిగుడి పండుగ సందర్భంగా హిందూయేతర వ్యాపారులు, వ్యాపారులకు ప్రవేశం ఉండకూడదని బ్యానర్లు వేశారు. ఆ తర్వాత పడుబిద్రి ఆలయ ఉత్సవాల్లో, దక్షిణ కన్నడ జిల్లాలోని కొన్ని దేవాలయాలలో కూడా ఇలాంటి బ్యానర్లు ప్రదర్శనమిచ్చాయి. యాదృచ్ఛికంగా, ఈ విషయంపై కొన్ని హిందూ అనుకూల సంస్థల అభ్యర్థనను మారి గుడి ఆలయ నిర్వాహకులు పట్టించుకోలేదు. కొంతమంది హిందూ కార్యకర్తలు ఈ విషయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అధికారులకు మెమోరాండాలను సమర్పించారు.
2002లో కర్ణాటక హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ శాఖ చట్టం, 1997కు రూపొందించిన నిబంధనలను ఉదహరిస్తూ.. మెమోరాండాలను జారీ చేశారు. అలాగే.. ఏటా జరిగే ఆలయ జాతరలు, మతపరమైన కార్యక్రమాల్లో హిందూయేతర వ్యాపారులను వ్యాపారానికి అనుమతించవద్దని, ఎలాంటి టెండర్లలో పాల్గొనకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) మైసూరు యూనిట్ శనివారం ముజ్రాయి (ఎండోమెంట్) శాఖ అధికారులకు మెమోరాండం సమర్పించింది.
తాజాగా మైసూరులోని ప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయ పరిధిలో ముస్లింల వ్యాపారాలు నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు దేవదాయశాఖ అధికారులకు విన్నవించారు. ఇచ్చిన దుకాణాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. ఇదే పరిస్థితి ఉత్తర కర్ణాటకలోనూ తెరపైకి రావడం చర్చనీయాంశమవుతోంది.
తాజాగా కొడగు జిల్లా సోమవారపేట తాలూకా శనివారసంతె మనేహళ్లిమఠంలో జరిగిన కులగోవుల సమ్మేళనం వేళ ముస్లిం వ్యాపారాలను నిషేధించాలని వీహెచ్పీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించారు. చిక్కమగళూరు తాలూకా ఖాండ్యా హోబళి హుయిగెరె గ్రామంలో కోలా ఉత్సవంలోనూ వివాదం తలెత్తింది. ఉడుపి జిల్లాలో హిజాబ్ వి వాదం తలెత్తిన తర్వాత జాతరల వేళ ముస్లింల వ్యాపారాల నిషేధం తెరపైకి వచ్చింది.
హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇటీవల ముస్లింలు బంద్కు మద్దతు తెలిపినందుకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నట్లు హిందూ కార్యకర్తలు తెలిపారు. భారత న్యాయ వ్యవస్థపై వారి నిర్లక్ష్యం చూపుతుందని అన్నారు. యూనిఫాం డ్రెస్ కోడ్ ఉన్న విద్యాసంస్థల్లో హిజాబ్ను అనుమతించాలంటూ ఉడిపికి చెందిన కొందరు బాలికలు వేసిన పిటిషన్ను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
రెండు రోజులుగా శాసనసభ, విధానపరిషత్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. న్యాయశాఖ మంత్రి మాధుస్వా మి వివరణ ఇచ్చారు. 2002 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాల పరిధిలో ఇతర మతస్థులు వ్యాపారాలు చేయకుండా నిషేధం విధించగా.. దానినే అమలు చేస్తున్నామని తెలిపారు. దేవాలయాలు, ఆథ్యాత్మిక సంస్థకు సమీపంలో ఉన్న భూమి, భవనం లేదా స్థలంతో సహా ఎటువంటి ఆస్తిని హిందువులు కానివారికి లీజుకు ఇవ్వరాదని నిబంధనల్లో పేర్కొన్నట్టు వివరించారు.
అయితే, ఆలయ ప్రాంగణం వెలుపల ఉన్న వీధి వ్యాపారులకు ఈ నిబంధన వర్తించదని, వారికి ఏదైనా ఆటంకాలు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన ప్రభుత్వం, తదుపరి చర్యలు తీసుకునే ముందు క్షేత్రస్థాయిలోని నిబంధనలను, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపింది.