
సంచలనం సృష్టించిన భజరంగ్ దల్ (Bajrang Dal) కార్యకర్త హర్ష (harsha) హత్య కేసులో అరెస్టు అయిన 10 మంది నిందితులను 11 రోజుల కష్టడీకి శివమొగ్గ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులను వారిని కష్టడీకి తరలించారు. ఈ మేరకు శివమొగ్గ (shivamogga) ఎస్పీ బి.ఎం.లక్ష్మీ ప్రసాద్ (B.M. Laxmi Prasad) మీడియాకు వివరాలు వెల్లడించారు.
శిమమొగ్గ ప్రాంతంలో విధించిన ఆంక్షలను ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ (DC) తెలిపారు. 28వ తేదీ 9 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని చెప్పారు. అయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వ్యాపారం చేయడానికి దుకాణాలకు అనుమతి ఇచ్చారు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఫిబ్రవరి 28వ తేదీ నుంచి విద్యాసంస్థలను తెరవడానికి అనుమతి ఇస్తారని ఆయన చెప్పారు. పుకార్లను పట్టించుకోవద్దని, శివమొగ్గలో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనేలా పరిపాలనకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఫిబ్రవరి 20వ రాత్రి భజరంగ్ దల్ కార్యకర్త హర్ష ను పలువురు హత్య చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు హత్య జరిగిన రోజే అరెస్టు చేశారు. ఆ సమయంలో మహ్మద్ కాషిఫ్ (Mohammed Kashif), సయ్యద్ నదీమ్ (Syed Nadeem), ఆషిఫుల్లా ఖాన్ (Ashifullah Khan), రెహన్ ఖాన్ (Rehan Khan), నేహాల్ (Nehal), అబ్దుల్ అఫ్నాన్ (Abdul Afnan)లను పొోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కాశీమ్ కు 32 సంవత్సరాలు ఉంటాయి. మిగిలిన అందరూ 20 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటారు. మిగిలిన నలుగురిని తరువాత అదుపులోకి తీసుకున్నారు.
ఫిబ్రవరి 20 రాత్రి హర్ష హత్య జరిగిన తరువాత శివమొగ్గ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలను విధించారు. అంతిమ సంస్కారాల కోసం ఆయన భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతుండగా, నగరంలోని పలు చోట్ల హింస చెలరేగింది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అప్పటి నుంచి 25వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. కానీ శాంతి భద్రతల నేపథ్యంలో వాటిని 28వ తేదీ వరకు పొడగించారు. అయితే ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, పరిశ్రమల ప్రతినిధులు, వీధి వ్యాపారులు తమ వ్యాపారాలు తెరవడానికి వీలుగా నిషేధ ఉత్తర్వులను సడలించాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు సోమవారం వరకు నగరంలో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ దుకాణాలు తెరుచుకోవాడానికి అనుమతి ఇచ్చారు.
భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యపై దేశ వ్యాప్తంగా చర్చనీయాశం అయ్యింది. ఈ హత్యకు కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ (hijab) వివాదానికి సంబంధం ఉందని కర్నాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక ( Revenue Minister R Ashoka) గతంలోనే తెలిపారు. కర్నాటకలోని ఉడిపి పట్టణంలోని మొదలైన ఈ హిజాబ్ వివాదం పలు రాష్ట్రాలకు పాకింది. ఇప్పుడు ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది.