Assembly Elections: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు, 5 కోట్ల మంది ఓట‌ర్లు.. దేశం దృష్టంతా అటువైపే

Published : Apr 09, 2026, 09:05 AM IST
Assembly Elections

సారాంశం

Assembly Elections: దేశంలో కీలకమైన మూడు అసెంబ్లీలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కేరళ, అస్సాం రాష్ట్రాలు అలాగే పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

భారీ భద్రత మధ్య ప్రారంభమైన పోలింగ్

మూడు ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. వేల సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర భద్రతా బలగాలు కూడా పెద్ద సంఖ్యలో మోహరించాయి. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు అనేక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను కూడా అమలు చేశారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయగలిగేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో కలిపి దాదాపు 5.3 కోట్ల మంది ఓటర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

కేరళలో ఎల్డీఎఫ్ – యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ

140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. మొత్తం 883 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి ప్రభుత్వ వ్యతిరేక భావన తమకు అనుకూలంగా మారుతుందని ఆశిస్తోంది. ఇక బీజేపీ కూడా ఈసారి రాష్ట్రంలో తన రాజకీయ స్థానం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కేరళలో మొత్తం ఓటర్లలో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు ఉన్నారు.

అస్సాంలో బీజేపీ – కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ

అస్సాంలో ప్రధానంగా బీజేపీ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మధ్య పోటీ సాగుతోంది. రాష్ట్రంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ కూటమి మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ నాయకత్వంలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 2.50 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.25 కోట్ల మంది మహిళలు, అలాగే 318 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు.

పుదుచ్చేరిలో బహుముఖ పోటీ

పుదుచ్చేరిలో రాజకీయ సమీకరణాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా, దాదాపు 9.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 294 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్ర హోదా అంశం ఈసారి ఎన్నికల్లో ప్రధాన చర్చగా మారింది. కాంగ్రెస్–డీఎంకే కూటమి, అధికార కూటమిపై విమర్శలు చేస్తోంది. అదే సమయంలో నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంతో పుదుచ్చేరిలో త్రిముఖ పోటీ వాతావరణం ఏర్పడింది.

ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి

కేరళలో సైద్ధాంతిక పోటీ, అస్సాంలో ద్విముఖ రాజకీయ పోరు, పుదుచ్చేరిలో బహుముఖ పోటీ ఉండటంతో ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వ‌నున్నార‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Free Health Care : ఉచిత వైద్యంలో నెంబర్ వన్.. శ్రీ మధుసూదన్ సాయి మెడికల్ కాలేజీకి NABH గుర్తింపు
Mallikarjun Kharge Reacts to Exit Polls: తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ షాకింగ్ రిజల్ట్ | Asianet Telugu