
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ( బీజేపీ), కాంగ్రెస్ పార్టీల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సంబంధించిన ఖాకీ నిక్కర్ కాలిపోతున్నట్లు ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ తో ఇరు పార్టీల మధ్య దుమారం రేగింది. అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య పరస్పర మాటల దాడి జరగుతోంది.
తాజాగా ఈ యుద్దంలోకి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దిగారు. తనదైనశైలిలో ఓ అరుదైన చిత్రాన్ని తన ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ చిత్రంలో.. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిక్కర్లో కనిపిస్తారు. కాంగ్రెస్ను, రాహుల్ గాంధీని విమర్శించడంలో ఫేమస్ అయిన హిమంత శర్మ ఆ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ.. “మీరు అతనిని కూడా కాల్చేస్తారా...” అనే శీర్షిక పెట్టి #BharatTodoyatri అనే హ్యాష్ట్యాగ్ను కూడా ఉపయోగించాడు.
ఈ ఫోటోలో తొలి ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్ ఖాకీ యూనిఫామ్లో కాకుండా కాంగ్రెస్ సేవాదళ్ యూనిఫాంలో కనిపించారు.
కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఖాకీ నిక్కర్ కాలుతున్నట్టు ఉన్న ఫోటోను ట్విట్ చేయడాన్ని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ దేశంలో హింస సృష్టించాలని కోరుకుంటున్నారా? ' అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
మరో వైపు కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రతిస్పందిస్తుంది. #BharatJodoYatra అనే హ్యాష్ట్యాగ్ని ఉపయోగించి ట్విట్టర్లో ఇలా రాసింది. "దేశాన్ని ద్వేషపూరిత సంకెళ్ల నుండి విముక్తి చేయడానికి, బీజేపీ-ఆర్ఎస్ఎస్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు దశలవారీగా లక్ష్యాన్ని చేరుకుంటాం’ అని ట్విట్ చేసింది.
తొలి ప్రధాని నెహ్రూ నిక్కర్ కథేంటీ?
హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేసిన పోస్టులో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిక్కర్ వేసుకుని కనిపిస్తున్నారు. దీంతో నెహ్రూ కూడా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తనేన అనే అనుమానాలు వెల్లువెత్తున్నాయి. పలు అసత్య ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అసలు విషయానికి వెళ్లే.. 1939లో అలహాబాద్లో కాంగ్రెస్ సేవాదళ్ సమావేశం జరిగింది. ఈ సదస్సులో నెహ్రూ కూడా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపనకు ఏడాది ముందు కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడింది. దీనికి మొదటి అధ్యక్షుడు పండిట్ నెహ్రూ.
అప్పట్లో ఖాకీ రంగుల బట్టలు ఎక్కువగా ఉండేవి. సేవాదళ్ కార్యకర్తలు శ్రమదానం చేసేటప్పుడు హాఫ్ ప్యాంటు మాత్రమే ధరించేవారు. కానీ, నెహ్రూ.. ఖాకీ నిక్కర్ ధరించి ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరయ్యారనే తప్పుడు వాదనతో నెహ్రూ షార్ట్స్లో ఉన్న చిత్రాలు తరచుగా వైరల్ అవుతున్నాయి. నాలుగేళ్ల క్రితం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పుడు.. అప్పట్లో ఈ ఫొటో వైరల్గా మారింది.