గుజరాత్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన రూ. 9వేల కోట్ల డ్రగ్స్ సీజ్!

By telugu teamFirst Published Sep 19, 2021, 6:20 PM IST
Highlights

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో అధికారులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న రూ. 9000 కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్ కంపెనీ ఆఫ్ఘనిస్తాన్ కంపెనీ నుంచి టాల్కమ్ పౌడర్ దిగుమతి చేసుకున్నట్టు పేర్కొన్న కన్‌సైన్‌మెంట్‌లోనే ఈ డ్రగ్స్ బయటపడినట్టు తెలిసింది. టాల్కమ పౌడర్‌ను పరీక్షించగా అందులో హెరాయిన్ ఉన్నట్టు తేలిందని అధికారవర్గాలు తెలిపాయి.
 

అహ్మదాబాద్: గుజరాత్ పోర్టులో అధికారులు భారీగా హెరాయిన్‌ను సీజ్ చేశారు. కచ్‌లోని ముంద్రా పోర్టులో రూ. 9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాన్ని పట్టుకున్నారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా ఇండియాకు వచ్చినట్టు తెలుస్తున్నది. భారీ కంటెయినర్‌లలో వస్తున్న ఈ డ్రగ్స్‌ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్ సంస్థ ఈ దిగుమతికి ఆర్డర్ పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. గత ఐదురోజులుగా మాదక ద్రవ్యాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

టాల్కమ్ పౌడర్ పేరిట ఈ డ్రగ్స్‌ను మన దేశానికి దిగుమతి చేసుకున్నట్టు తేలింది. పైకి చూస్తే టాల్కమ్ పౌడర్‌లాగే ఉన్నప్పటికీ దాన్ని పరీక్షిస్తే హెరాయిన్‌ అని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. విజయవాడకు చెందిన ట్రేడింగ్ సంస్థ ఆ కన్‌సైన్‌మెంట్‌ను టాల్కమ్ పౌడర్‌గానే పేర్కొంది. ఎగుమతి చేస్తున్న కంపెనీ మాత్రం ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన హస్సాన్ హుస్సేన్ లిమిటెడ్‌గా తెలుస్తున్నది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో ఉన్నట్టు సమాచారం.

తొలుత రూ. 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ అధికారులు గుర్తించారు. కానీ, సరైన అంచనాకు రావడానికి అధికారులు టాల్కమ్ పౌడర్‌ను హెరాయిన్‌ను వేరుచేసే పనిలో పడ్డారు. తాజాగా, రూ. 9000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడినట్టు అధికారవర్గాలు తెలిపాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లకు ప్రధాన ఆదాయ వనరుగా ఓపియం, ఇతర డ్రగ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశం నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్ భారత్‌కు చేరడంపై కలకలం రేగింది.

click me!