Cancer: ప్రపంచ క్యాన్సర్ రాజధానిగా భారత్ !

By Rajesh KarampooriFirst Published Apr 6, 2024, 8:00 AM IST
Highlights

Cancer: భారతదేశంలో ఆరోగ్య పరిస్థితిపై  తాజాగా వెలువడిన ఓ నివేదిక ఆందోళనకర విషయాలను వెల్లడించింది. దేశంలో క్యాన్సర్‌, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, హృద్రోగం, మానసిక సమస్యల వంటి అసాంక్రమిక వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయని, ప్రధానంగా క్యాన్సర్ పెరుగుదల మరింత ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఈ పెరుగుదల భారత్ క్యాన్సర్‌కు రాజధానిగా మారిపోయిందని నివేదిక వెల్లడించింది. 

Cancer: భారతదేశంలో ఆరోగ్య పరిస్థితిపై తాజాగా వెలువడిన ‘హెల్త్‌ ఆఫ్‌ ది నేషన్‌’ అనే అపోలో హాస్పిటల్స్‌ నివేదిక ఆందోళన కలుగజేస్తోంది. దేశంలో క్యాన్సర్‌, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, హృద్రోగం, మానసిక సమస్యల వంటి అసాంక్రమిక వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొంది. అందులో ముఖ్యంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొంది. గ్లోబల్ రేట్లతో పోలిస్తే భారతదేశంలో క్యాన్సర్ గణనీయంగా పెరుగుతుండడం ముఖ్యంగా ఆందోళనకరమని, భారతదేశాన్ని 'ప్రపంచంలోని క్యాన్సర్ రాజధాని'గా మార్చిందని పేర్కొంది.

 అలాగే.. పలు అసాంక్రమిక వ్యాధులు చిన్న వయసులోనే తలెత్తున్నాయనీ దీనిని నివారించటానికి తక్షణం చర్యలు చేపట్టాలని సూచించింది. క్యాన్సర్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందనీ, ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సగటు వయసు చాలా తక్కువగా ఉండటం ఆందోళనకరమని తెలిపింది. భారతదేశంలో సంభవించే అత్యంత సాధారణమైన క్యాన్సర్‌లు మహిళల్లో రొమ్ము, గర్భాశయం, ఓవర్రీ క్యాన్సర్ కాగా..  పురుషులలో ఊపిరితిత్తులు, నోరు కాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, మధ్యస్థ వయస్సు ఉన్న పురుషులలో క్యాన్సర్ నిర్ధారణ ఇతర దేశాల కంటే తక్కువగా ఉందనీ, అయినప్పటికీ.. భారతదేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని విడుదల పేర్కొంది. 

అలాగే.. భారతీయుల్లో స్థూలకాయం, మధుమేహం(ప్రీ-డయాబెటీస్), రక్తపోటు(ప్రీ-హైపర్‌టెన్షన్), మానసిక కుంగుబాటు(మెంటల్ హెల్త్ డిజార్డర్స్) వంటి పరిస్థితుల కారణంగా అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతున్నాయని అపోలో హాస్పిటల్స్ ఫ్లాగ్‌షిప్ హెల్త్ ఆఫ్ నేషన్ రిపోర్ట్-2024 వార్షిక నివేదిక అంచనా వేసింది. రోజుకు సగటున కనీసం ముగ్గురిలో ఒకరు మధుమేహ వ్యాధిగ్రస్తులు, ముగ్గురిలో ఇద్దరు ప్రీ-హైపర్‌టెన్సివ్, 10 మందిలో ఒకరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని వెల్లడించింది. 

క్యాన్సర్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హృదయ సంబంధ వ్యాధులు, మానసిక సమస్యల వంటి అసాంక్రమిక వ్యాధులు దేశంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయని నివేదిక వెలుగునిస్తుంది. ఇవన్నీ దేశం మొత్తం ఆరోగ్యంపై గణనీయంగా ప్రభావం చూపుతాయని తెలిపింది.  స్థూలకాయం సమస్య 2016లో 9 శాతం ఉండగా 2023లో 20 శాతానికి పెరిగిందనీ, రక్తపోటు 2016లో 9 శాతం ఉండగా 2023లో 13 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. అధిక సంఖ్యలో భారతీయులు ప్రమాదంలో ఉన్నారని పేర్కొంది. అదే సమయంలో రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్‌ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ.. రక్తపోటు (BP),బాడీ మాస్ ఇండెక్స్ (BMI)స్థాయిలను నియంత్రించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాస్త బయటపడవచ్చని వెల్లడించింది.  

 
ఈ నివేదికపై అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. మన దేశ అభివృద్ధిలో ఆరోగ్య ప్రాముఖ్యతను వివరించారు. పెరుగుతున్న అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచటంతోపాటు వ్యక్తిగత స్థాయిలో చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. మొత్తం ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ, దేశం ఏకతాటిపైకి రావాలని, ఏకీకృత దృక్పథాన్ని కలిగి ఉండాలని విశ్వసిస్తున్నామని అన్నారు. 

అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్ & సీఈఓ డాక్టర్ మధు శశిధర్ మాట్లాడుతూ.. అసాంక్రమిక వ్యాధులు గణనీయమైన పెరుగుదల ప్రపంచ ఆరోగ్య దృశ్యంలో తీవ్ర మార్పును సూచిస్తుందని, దేశాలకు బలీయమైన సవాళ్లను విసురుతుందని అన్నారు. వైద్య చికిత్సలకు సంబంధించి మరిన్ని ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని, వాటిని ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.  

click me!