
Delhi man kills live-in partner: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రీజర్ లో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. తాను డేటింగ్ లో ఉన్న మహిళను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు మూడు రోజుల క్రితం మహిళను హత్య చేసి మృతదేహాన్ని దాబా ఫ్రీజర్ లో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో శ్రద్దా తరహా ఘటనగా దీనిని చూడవచ్చు.
వివరాల్లోకెళ్తే.. నైరుతి ఢిల్లీలోని నజఫ్ గఢ్ లోని ఓ దాబాలో ఫ్రీజర్ లో 25 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. రెండు మూడు రోజుల క్రితం మహిళను హత్య చేసి మృతదేహాన్ని దాబా ఫ్రీజర్ లో భద్రపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దాబా యజమాని సాహిల్ గహ్లోత్ ను అరెస్టు చేశారు. బాధితురాలు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. నిందితుడు మృతురాలి లివ్ ఇన్ పార్టనర్ అనీ, ఆమెను గొంతు నులిపి చంపి రిఫ్రిజిరేటర్ లో పెట్టాడని పేర్కొన్నారు. అయితే, నిందితుడు తాను సహజీవనంలో ఉన్న మహిళను చంపి, ఫ్రిజర్ పడేసిన కొన్ని గంటల తర్వాత మరో మహిళను వివాహం చేసుకోవడం గమనార్హం.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, 24 ఏళ్ల నిందితుడు 2018 లో బాధితురాలు నిక్కీ యాదవ్ ను ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని ఒక కోచింగ్ సెంటర్లో కలిశానని ఢిల్లీ పోలీసులకు చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత వీరి సంబంధం పెరిగింది .ఈ క్రమంలోనే సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే, వేరే మహిళను వివాహం చేసుకోవాలని తన కుటుంబం తనపై ఒత్తిడి తెస్తోందని, చివరకు 2022 డిసెంబర్ లో నిశ్చితార్థం, వివాహం వరుసగా ఫిబ్రవరి 9, 10 తేదీలకు ఫిక్స్ అయ్యాయని సాహిల్ గహ్లోత్ చెప్పాడు. కానీ, నిందితుడు తన నిశ్చితార్థం లేదా వివాహ ప్రణాళికల గురించి నిక్కీకి చెప్పలేదు. ఈ విషయం ఎలాగోలా తెలుసుకున్న ఆమె అతన్ని లదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అనంతరం సాహిల్ తన కారులో ఉంచిన డేటా కేబుల్ తో నిక్కీ గొంతుకు బిగించి ప్రాణాలు తీశాడు. మృతదేహాన్ని పడేసిన తర్వాత సాహిల్ తన ఇంటికి వెళ్లి మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
ఫిబ్రవరి 9, 10 తేదీల మధ్య రాత్రి తన ప్రియురాలిని హత్య చేశానని, కొన్ని గంటల తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నానని సాహిల్ పోలీసులకు వెల్లడించాడు. ఓ మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని గ్రామ శివారులోని దాబాలో దాచినట్లు మంగళవారం ఉదయం తమకు సమాచారం అందిందని అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ద్వారకా) విక్రమ్ సింగ్ తెలిపారు. నిందితుడు మిత్రాన్ గ్రామానికి చెందినవాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.