
గురుగ్రామ్ : అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నాడో మహాకవి.. ఇలాంటిదే నేరమనస్తత్వం ఉన్నవారికి కూడా మరో రకంగా వర్తిస్తుంది. స్పూనూ, ఫోర్కూ, ప్లేటూ కాదేదీ దాడికి అనర్హం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విషయం ఏంటంటే.. గురుగ్రామ్ లోని భోండ్సీ జైలులో తోటి ఖైదీపై స్పూన్ తో దాడి చేసి గాయపరిచాడో ఖైదీ.
శుక్రవారం భోండ్సీ జైలులో ఈ ఘటన జరిగిందని పోలీసులు శనివారం తెలిపారు. ఖైదీ తన తోటి ఖైదీపై చెంచాతో దాడి చేసి గాయపరిచాడని అన్నారు. రేవారి జిల్లాలోని జతుసానా గ్రామానికి చెందిన అండర్ ట్రయల్ ఖైదీ మంగత్ రామ్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం జైలులో ఈ దాడి జరిగింది.
పటియాలా గురుద్వారా ప్రాంగణంలో మద్యం సేవించిన మహిళ హత్య
“శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో-రేవారి నివాసి మోను అలియాస్ బుద్దా ఆరు అంగుళాల పొడవు గల చెంచాతో నాపై దాడి చేశాడు. అతను నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు’’ అని మంగత్ రామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అతని ఫిర్యాదు ఆధారంగా, మోనుపై శనివారం భోంద్సీ పోలీస్ స్టేషన్లో IPC సెక్షన్లు 323 (బాధ కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని మీద "దర్యాప్తు జరుగుతోంది. నిందితుడైన ఖైదీని త్వరలో విచారణ కోసం ప్రొడక్షన్ వారెంట్పై తీసుకువెళతారు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్స్టర్ టిల్లూ తాజ్పురియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు హతమార్చిన నేపథ్యంలో హర్యానాలోని అన్ని జైళ్లూ అప్రమత్తమయ్యాయి. ఖైదీలకు భోజన సమయంలో చెంచాలు ఇవ్వకూడదని జైలు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.