
కటక్ (ఒడిశా) : రాత్రి పూట కుక్కల అరుపులు (Howling) ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటాయి. మాంచి నిద్రలో ఇవి చాలా చిరాకును కలిగిస్తాయి. ఆ టైంలో వాటిని తరిమి కొట్టడమో.. మున్సిపాలిటీ వాళ్లకు ఫిర్యాదు చేయడమో చేస్తాం. కానీ ఒడిశా (Odisha)లో ఓ వ్యక్తి ఈ కారణంతో దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా 20 వీధికుక్క(Stray Dogs)లను విషం (Poison) పెట్టి మట్టుబెట్టాడు (Killed).
ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. గత 20 రోజులుగా రాత్రి వేళలో విపరీతంగా అరుస్తూ.. నిద్రపోనివ్వడంలేదని.. మిఠాయి షాపు యజమాని (24)
20 వీధి కుక్కలకు విషపు ఆహారం ఇచ్చాడు. దీంతో ఆ కుక్కలు చనిపోయాయి. ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రాత్రి వేళే కాదు.. ఉదయం వేళ్లలో తన షాపు దగ్గర కూడా ఒకటే అరుస్తూ, చిరాకు పుట్టిస్తున్నాయని ఈ పని చేశాడని పోలీసులు చెప్పారు.
స్థానికంగా ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలోని గొయ్యిలో పది వీధికుక్కల మృతదేహాలు కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కటక్ నగరానికి ఉత్తరాన 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగి-చౌడ్వార్ బ్లాక్లోని శంకర్పూర్ గ్రామ మార్కెట్, దాని పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని కుక్కల మృతదేహాలను కనుగొన్నారు.
కుక్కలు రాత్రిపూట అరవడం, అవి చేసే రచ్చ భరించలేకే విసుగు చెంది.. తాను కుక్కలకు విషం కలిపిన ఆహారాన్ని ఇచ్చానని నిందితుడు ఒప్పుకున్నాడని ఒక పోలీసు అధికారి చెప్పారు.
ఆ వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతి, జంతువుల పట్ల హింస నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిందని, మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.