
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మొన్న కిచిడీ వండిన ఆయన... తాజాగా ఆటో కూడా నడిపారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా స్వయంగా షేర్ చేసి... తన రియాక్షన్ కూడా ఇచ్చారు.
బిల్ గేట్స్... తన భారత పర్యటనలో ఆనంద్ మహీంద్రాతో కూడా సమావేశమయ్యారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. గేట్స్తో ఉన్న చిత్రాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. వారిద్దరూ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో క్లాస్మేట్స్ అని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు, బిల్ తాను మహీంద్రా ట్రియోను నడుపుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మొదటగా, బిల్ గేట్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తాను మహీంద్రా ట్రియోను నడుపుతున్న వీడియోను పంచుకున్నాడు. ఇది ఎలక్ట్రిక్ ఆటో-రిక్షా, ఇది 131 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనిలో నలుగురు ప్రయాణించగలరు. కాగా... ఈ ఆటో రిక్షాకి బిల్ గేట్స్ బాగా ఇంప్రెస్ అయ్యారు.
"ఇన్నోవేషన్ పట్ల భారతదేశం అభిరుచి ఎప్పటికీ విస్మయపరచదు. నేను ఎలక్ట్రిక్ రిక్షాను నడిపాను, 131కిమీ (సుమారు 81 మైళ్ళు) వరకు ప్రయాణించగలదు.నలుగురు ప్రయాణించగలరు. మహీంద్రా వంటి కంపెనీలు రవాణా పరిశ్రమను డీకార్బనైజేషన్ చేయడంలో దోహదపడడం స్ఫూర్తిదాయకంగా ఉంది," గేట్స్ రాశారు.
కాగా... ఆయన వీడియోకి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఇది చల్తీకా నామ్ బిల్ గేట్స్ గాడీ అంటూ... ఓ హిందీ పాటను ట్యూన్ చేస్తూ మహీంద్రా క్యాప్షన్ ఇవ్వడం విశేషం.