
పొలంలో వరి నాట్లు వేస్తున్న సమయంలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో ఆ పొలంలో ఉన్న వారందరికీ కరెంట్ షాక్ వచ్చింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం బీహార్ లో చోటు చేసుకుంది. దీనిపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
బీహార్ లో కూలిన మరో వంతెన.. ఒకే నెలలో ఇది మూడో ఘటన
వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ పూర్ణియాలోని తీకాపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరియార్ బహియార్ గ్రామంలోని ఓ పొలంలో పలువురు మహిళలు వరినాట్లు వేసే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే అదే పొలంలో కరెంట్ పోల్స్ ఉన్నాయి. ఈ పోల్స్ పై 11 కేవీ విద్యుత్ తీగలు ఉన్నాయి. నాట్లు వేస్తున్నారు కాబట్టి పొలంలో నీరు నిలిచి ఉంది. ఈ క్రమంలో ఆ పోల్స్ పై ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ఒక్క సారిగా తెగి కిందపడ్డాయి.
అయితే నీరు నిలిచి ఉండటం వల్ల ఆ పొలంలో పని చేస్తున్న అందరూ విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించి విద్యుత్ సరఫరా నిలిపివేసి బాధితులను రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మరో మహిళ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మృతులను రేణుదేవి, వీణాదేవి, రాణిదేవి, రవీతాదేవిగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన సులేఖాదేవి, జులేఖాదేవిల పరిస్థితి కూడా విషమంగానే ఉంది.
విచారం వ్యక్తం చేసిన సీఎం నితీశ్ కుమార్
ఈ ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి నష్టపరిహారం, క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందిస్తామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని వెల్లడించారు. ‘‘పూర్ణియాలోని తీకాపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరియార్ బహియార్ గ్రామంలో వరి నాట్లు వేస్తుండగా నలుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తాం. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తాం’’ అని సీఎం ట్వీట్ చేశారు.