
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో ఉగ్రకార్యకలాపాలు పెరుగుతున్నాయనీ, దేశానికి ముప్పు పొంచివున్నదనే రిపోర్టుల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా.. జమ్మూకాశ్మీర్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన జమ్మూకాశ్మీర్ భద్రతను సమీక్షించారు. తీవ్రవాద నిరోధక చర్యలపై దృష్టి సారించిన ఆయన అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శ్రీనగర్లోని అధికారుల ప్రకారం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరగడం, చొరబాటుదారుల సమస్యలు వంటివి అధికం అవుతున్నాయి. పీర్ పంజాల్ కు ఇరువైపుల వున్న ఉగ్రమూఖలను అరికట్టే చర్యలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించారు.
జమ్మూ కాశ్మీర్లోని భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను సమన్వయం చేశాయి. పాక్ ఆధారిత గ్రూపులకు చెందిన ఉగ్రవాదులను మరియు లోయలోని వారి ప్రాక్సీలను చురుకుగా మట్టుబెట్టగలిగాయి.రెడీమేడ్ IEDలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిఘా నివేదికలు పేర్కొనడంతో ఈ చర్యలను ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. ఇప్పటికే అనేక RDX-ఆధారిత IEDలు సరిహద్దు దాటి పంపబడినట్లు అందిన నివేదికలతో యంత్రాంగం అప్రమత్తమైంది.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పారా మిలటరీ బలగాలు మరియు భారత సైన్యం మద్దతుతో గత మూడు నెలల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టగలిగినప్పటికీ, బహవల్పూర్ కేంద్రంగా ఉన్న జైష్-ఎ-మహ్మద్ ఉగ్రమూకలు..చురుకుగా ఉన్నారు. అలాగే, లష్కరే తోయిబా కూటా లోయలో కల్లోలం సృష్టించే అవకాశముందని అధికారులు పేర్కొంటూ.. వారికి అడ్డుకట్ట వేసే చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
ఆగస్టు 15, 2021న కాబూల్ను తాలిబాన్ ఆక్రమించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణం బలగాలు.. అసాల్ట్ రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు, స్నిపర్ రైఫిల్స్, C-4 పేలుడు పదార్థాలతో సహా అధునాతన ఆయుధాల పర్వతాన్ని వదిలిపెట్టడంతో, భద్రతా ఏజెన్సీలలో ఆందోళన నెలకొంది. అమెరికా తయారు చేసిన ఆయుధాలు లోయలో ఉపయోగించేందుకు పాకిస్థానీ పంజాబీ టెర్రర్ గ్రూపుల చేతుల్లోకి వెళ్తాయి. ఇప్పటికే, అగ్రశ్రేణి తాలిబాన్ నాయకత్వంతో సైద్ధాంతిక, కుటుంబ సంబంధాలను కలిగి ఉన్న ఉగ్ర సంస్థలు దారుణాలకు ఒడిగట్టే అవకాశం ముంది.
ఇదిలావుండగా, అంతకు ముందు రోజు కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో వీరమరణం పొందిన జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బందికి చెందిన నలుగురు భద్రతా సిబ్బందికి కారుణ్య ప్రాతిపదికన నియామక ఉత్తర్వులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం జమ్మూలో అందజేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో ఉన్న హోం మంత్రి, అమరవీరులైన భద్రతా సిబ్బంది యొక్క సమీప బంధువులతో కూడా సంభాషించారు. వారితో సంభాషిస్తూ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ధైర్య సాహసాలను కొనియాడారు. దివంగత సార్జెంట్ రోహిత్ కుమార్ భార్య అయిన పూజాదేవి జమ్మూ జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా నియామక ఉత్తర్వులు అందజేశారు.