మిత్రపక్షాలను దువ్వేందుకు బిజెపి ప్లాన్
న్యూఢిల్లీ: మిత్రపక్షాలతో సంబంధాలను మెరుగుపర్చుకొనేందుకు గాను బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మిత్రపక్షాలతో సంబంధాలను మరింత పునరుద్దరించుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే శివసేన, అకాలీదళ్ పార్టీల నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తొలుత జూన్ 6వ తేదిన శివసనే చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కానున్నారు.
జూన్ 6వ తేది సాయంత్రం శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను ముంబైలోని ఆయన నివాసంలోని మాతోశ్రీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలవనున్నారు.దేశ వ్యాప్తంగా ఎన్డీయేలో శివసేన భాగస్వామిగా ఉంది. మహారాష్ట్రలో బిజెపి, శివసేన మధ్య ఉన్న పొత్తుకు మంగళం పాడారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తును విచ్చిన్నమైంది. కానీ, కేంద్రంలోని ఎన్డీఏలో శివసేన
కొనసాగుతోంది.
మహరాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ , ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉప్ ఎన్నికల్లో కూడ శివసేన ఒంటరిగానే పోటీ చేసింది. పాల్ఘార్ ఎంపీ స్థానంలో శివసేన అభ్యర్ధిపై బిజెపి స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఈ స్థానంలో బిజెపి విజయంపై శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఓటర్లకు డబ్బులు పంచి బిజెపి ఎన్నికల్లో విజయం సాధించిందని శివసేన చీఫ్ ఉధ్దవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు. ఈ స్థానంలో రీ కౌంటింగ్ చేయాలని కూడ ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వదిలిపెట్టబోమని కూడ ఆయన తేల్చి చెప్పేశారు.
తాజాగా వచ్చిన 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు, 4 ఎంపీ స్థానాల్లో బిజెపి దారుణంగా దెబ్బతింది. ఒక్క ఎంపీ, ఒక్క అసెంబ్లీ స్థానంతోనే బిజెపి సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మిత్రపక్షాలు కూడ బిజెపి తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయి.దీంతో మిత్రపక్షాలను సంతృప్తిపర్చేందుకుగాను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగాడు.
జూన్ 6వ తేది సాయంత్రం శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను ఆయన వివాసంలో కలవనున్నారు. ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించేందుకు అమిత్ షా ప్రయత్నం
చేయనున్నారు. మరోవైపు అకాలీదళ్ నేతలను కూడ బిజెపి చీఫ్ అమిత్ షా కలవనున్నారు. శివసేనతో చర్చలు మగిసిన తర్వాత అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ను అమిత్ షా కలిసే అవకాశం ఉందని సమాచారం.
మహారాష్ట్రలో 48 ఎంపీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో బిజెపి 23, శివసేన 18 స్థానాల్లో ఈ రాష్ట్రం నుండి విజయం సాధించాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు శివసేన ఇప్పటికే ప్రకటించింది. ఈ తరుణంలో అమిత్ షా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.