కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం నాడు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం నాడు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. శ్వాస సంబంధమైన సమస్యలతో అమిత్ షా ఎయిమ్స్ లో చేరినట్టుగా తెలుస్తోంది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని డాక్టర్ల బృందం అమిత్ షాకు చికిత్స అందిస్తున్నారు.
ఈ నెల 14వ తేదీన కరోనా నుండి అమిత్ షా కోలుకొన్నారు. ఈ నెల 2వ తేదీన అమిత్ షాకు కరోనా సోకింది. దీంతో ఆయన గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో 12 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆయన ఈ నెల 14వ తేదీన కరోనా నుండి కోలుకొన్నారు.
తనను కలిసిన వారంతా స్వీయ నిర్భంధంలోకి వెళ్లాలని అదే విధంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కూడ అమిత్ షా గతంలో సూచించిన విషయం తెలిసిందే.
తాను కరోనా నుండి కోలుకొన్నట్టుగా కూడ అమిత్ షా ట్విట్టర్ వేదికగా కూడ ప్రకటించారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చింది, దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. తన కుటుంబాన్ని ఆశీర్వదించిన, తన శ్రేయస్సు కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా ఆయన ట్విట్టర్ లో తెలిపారు.
డాక్టర్ల సలహా మేరకు తాను హోం ఐసోలేషన్ లో ఉంటానని కూడ ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.మరో ట్వీట్ లో తనకు వైద్యం అందించిన మేదాంత ఆసుపత్రిలోని వైద్యులకు, యాజమాన్యానికి కూడ ఆయన ధన్యవాదాలు చెప్పారు.