భారత్, కెనడాల మధ్య విభేదాలు.. అమెరికా ఏమన్నదంటే?

Published : Sep 19, 2023, 12:44 PM IST
భారత్, కెనడాల మధ్య విభేదాలు.. అమెరికా ఏమన్నదంటే?

సారాంశం

భారత్, కెనడాల మధ్య విభేదాల పై అమెరికా స్పందించింది. కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు తమలో తీవ్ర ఆందోళనలు రేపాయని వివరించింది. దర్యాప్తు చేసి న్యాయం సమకూర్చాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.  

న్యూఢిల్లీ: ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య తాజా వివాదానికి కేంద్రబిందువుగా మారింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ.. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉన్నదా అనే ఆరోపణలపై కెనడా సెక్యూరిటీ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆయన ఆరోపణలను ఖండించింది. ఆయన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని పేర్కొంది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై దర్యాప్తు ప్రారంభించగానే కెనడాలోని భారత రాయబారిని బహిష్కరిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకుంది. దీంతో భారత ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించింది. మన దేశం నుంచి కెనడా రాయబారి ఐదు రోజుల్లోగా వెళ్లిపోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

Also Read: భారత్ - కెనడాల మధ్య ముదురుతున్న దౌత్య యుద్ధం..

ఈ వివాదంపై అమెరికా స్పందించింది. ఆ దేశం కెనడా వైపు మొగ్గుచూపినట్టుగా తెలుస్తున్నది. వైట్ హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ స్పందిస్తూ.. కెనడా ప్రధానమంత్రి ట్రూడో ప్రస్తావించిన ఆరోపణలు తమలో తీవ్ర ఆందోళనలను కలుగజేశాయని వివరించింది. కెనడా భాగస్వాములతో తాము నిత్యం అనుసంధానంలో ఉంటామని తెలిపింది. కెనడా దర్యాప్తు చేయడం అత్యవసరం అని పేర్కొంది. న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు వివరించింది.

PREV
click me!

Recommended Stories

Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు| Asianet News Telugu
ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?