
Amarnath Yatra 2023:జమ్మూ కాశ్మీర్లో ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్ర మూడు రోజుల పాటు నిలిపివేయబడింది. అమర్నాథ్ యాత్రికులు పంజ్తర్ని, శేషనాగ్ బేస్ క్యాంపుల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల తర్వాత మళ్లీ ఆదివారం (జూలై 9) యాత్ర ప్రారంభమైంది.
అమర్నాథ్ లో అనుకూల వాతావరణం ఏర్పడిన అనంతరం.. అధికారులు గుహ మందిరం తలుపులు తెరిచి, దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాలలో సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని సందర్శించడానికి భక్తులను అనుమతించారని అధికారులు తెలిపారు.
ఇప్పటికే దర్శనం చేసుకున్న యాత్రికులు బల్తాల్ బేస్ క్యాంపుకు తిరిగి వెళ్లేందుకు అనుమతించినట్లు పంజ్తర్ని బేస్ క్యాంపు సీనియర్ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా లోయలో చిక్కుకుపోయిన 700 మందికి పైగా అమర్నాథ్ యాత్రికులకు అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండ్లోని తమ శిబిరంలో సైన్యం ఆశ్రయం కల్పించింది.
సోమవారం నుంచి ఈ ప్రాంతంలో వాతావరణం మరింత మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారికి అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ చెత్తాచెదారం తొలగించి మరమ్మతులు చేసే పనులు కొనసాగుతున్నాయి. రహదారి ట్రాఫిక్ యోగ్యమైనదిగా మారిన తర్వాత చిక్కుకున్న వాహనాలను ప్రాధాన్యత ప్రాతిపదికన ఖాళీ చేయనున్నారు.
తర్వలో ముగి నున్న యాత్ర
దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి 62 రోజుల వార్షిక తీర్థయాత్ర జూలై 1న అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్ , గందర్బాల్ జిల్లాలోని బల్తాల్ నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. ప్రయాణీకుల భద్రత కోసం డ్రోన్లు, మెటల్ డిటెక్టర్లు, ఇతర నిఘా పరికరాలు, ఆధునిక ఆయుధాలతో కూడిన సిబ్బందిని హైవేపై మరియు వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు అధికారులు పిటిఐకి తెలిపారు.