
ఈ రోజు ఉదయం 70 మందితో ప్రయాణికులతో కూడిన అలయన్స్ విమానం ఇంజన్ కవర్ లేకుండానే ముంబై నుంచి భుజ్(Bhuj)కు టేకాఫ్ అయ్యింది. అయితే ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ముంబై నుంచి బయలుదేరిన అలయన్స్ ఎయిర్ ATR 72-600 విమానంలో నలుగురు సిబ్బంది, ఒక ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఉన్నారు. ఈ ఘటనకు కారణమేంటని ఏవియేషన్ వాచ్డాగ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అది ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తోంది.
విమానం టేకాఫ్ కాగానే ఇంజిన్ కవర్ (కౌలింగ్) కిందపడిపోయిందని అధికారులు తెలిపారు. ఇంజిన్ కౌలింగ్ కోల్పోవడం వల్ల గమ్యస్థానానికి వెళ్లే విమానంపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని DGCA అధికారులు మీడియాతో తెలిపారు. ‘‘ అలయన్స్ ఎయిర్ ముంబై నుండి భుజ్కు వెళ్లాల్సి ఉంది. అయితే విమానం ఇంజిన్ కౌల్ రన్వేపై పడి ఇంజిన్ కవర్ లేకుండా టేకాఫ్ అయింది. టేకాఫ్ తర్వాత రన్వే వైపు ఇంజిన్ కౌలింగ్ కనిపించదని ముంబై ATC నివేదించింది. ఆ సమయంలో విమానం ప్రయాణంలోనే ఉంది.’’ అని ముంబై ఎయిర్పోర్ట్ అధికారి చెప్పారు. ప్రయాణికులంతా భుజ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. DGCA ఈ ఘటనకు వెనక ఉన్న కారణాలను పరిశోధిస్తుందని అన్నారు. దీనికి బాధ్యులు ఎవరనేది నిర్ణయిస్తుందని తెలిపారు.
నిర్లక్షమే కారణం.. ?
అలయన్స్ ఎయిర్ ATR 72-600 కు ఇలాంటి ఘటన ఎదురుకావడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని విమానయాన నిపుణుడు కెప్టెన్ అమిత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ విమానానికి నాలుగేళ్ల వయస్సు ఉందని చెప్పారు. దీనిని సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఇలా జరిగిందని అన్నారు.