
హిజాబ్ వివాదంపై నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ (Malala Yousafzai) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. కర్ణాటకలోని విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం వివాదాస్పదం కావడంతో.. దీనిపై మలాలా స్పందించారు. హిజాబ్ ధరించిన విద్యార్థులను విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హిజాబ్తో విద్యార్థినులను అనుమతించకపోవడం భయానక చర్యగా పేర్కొన్నారు. అయితే మలాలా చేసిన వ్యాఖ్యలను పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఆమెను పెయిడ్ ప్రచారకర్తగా (paid propagandist) పిలుస్తున్నారు.
గతంలో మలాలా ఆమె పుస్తకంలో చెప్పిన వ్యాఖ్యలను వారు గుర్తుచేస్తున్నారు. మలాలా బుర్కా ధరించడంపై చెప్పిన మాటలను జత చేస్తూ.. ఆమె తన మునపటి స్టాండ్ను మార్చుకున్నారని పేర్కొంటున్నారు. మలాలాది ద్వంద వైఖరి అంటూ మండిపడుతున్నారు. I am Malala బుక్లో ఆమె చెప్పిన మాటలు ఇవే అంటూ పోస్టులు చేస్తున్నారు.
ఇక, కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ బాలికల పియు కళాశాలలో గత నెలలో హిజాబ్ నిరసనలు ప్రారంభమయ్యాయి. హిందు విద్యార్థినులు కాషాయం కండువాలు ధరించి.. హిజాబ్ వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. తరగతుల్లో హిజాబ్ నిషేధించారని ఆరోపించారు. ఈ నిరసనలు ఉడిపి, చిక్కమగళూరులోని వ్యాపించాయి.. రైట్వింగ్ గ్రూపులు.. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. త్వరలో ఈ వివాదం కర్ణాటక సరిహద్దులు దాటి బీజేపీ పాలిత మధ్యప్రదేశ్,పుదుచ్చేరిలోకి కూడా వ్యాపించింది. ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకోవడంతో.. మరింత తీవ్రమైంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. దీంతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.
మరోవైపు, హిజాబ్ ఆంక్షలను ప్రశ్నిస్తూ ఉడిపిలోని ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినీలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. శాంతియుతంగా ఉండాలని ప్రజలు, విద్యార్థులకు సూచించింది. హిజాబ్ వివాదం కర్ణాటకవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విద్యార్థులను హెచ్చరించారు. శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీసులను ఉపయోగించే పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు. ఈ వ్యవహారం పార్లమెంట్నూ తాకింది. కాంగ్రెస్, డీఎంకే, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్, సీపీఎం, సీపీఐ, జేఎంఎం పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.