
Karnataka: భవిష్యత్తులో ఏదో ఒక రోజు.. దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లందరూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో కలుస్తారని కర్ణాటక మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్టాటక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో శాంతి భద్రతలపై గురువారం చర్చ జరిగింది.
ప్రతిపక్ష సభ్యులు కూడా ‘మన ఆర్ఎస్ఎస్’ అనే రోజు వస్తుందన్నారు. ‘ఇది మా ఆర్ఎస్ఎస్, నా ఆర్ఎస్ఎస్. మీరు (ప్రతిపక్షం) కూడా రానున్న రోజుల్లో మన ఆర్ఎస్ఎస్ అని, ఆర్ఎస్ఎస్ను అందరూ ‘మా’ ఆర్ఎస్ఎస్గా అంగీకరించే రోజు ఎంతో దూరంలో లేదని కాగేరి అన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మండిపడ్డారు. క్రైస్తవులు, ముస్లింలు ఆర్ఎస్ఎస్ అంటారని చెప్పడానికి మీరెవరు? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేజే జార్జ్ ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను ఎప్పటికీ ఆర్ఎస్ఎస్లో కలవబోనని, ఆ పేరు కూడా చెప్పబోనని అసెంబ్లీలో అన్నారు. కాగా, అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్పై చర్చకు ఆయన చేసిన వ్యాఖ్యలే దారి తీశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన కొంత మంది నేతలు, మంత్రులతో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయని సిద్ధరామయ్య తెలిపారు. ‘వ్యక్తిగత సంబంధాలు చాలా ముఖ్యం. ఆ తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల వంటి వ్యత్యాసాలు’ అని అన్నారు. "మా ఆర్ఎస్ఎస్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?" స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే .. సిద్దిరామయ్యను అడిగాడు. ఆర్ఎస్ఎస్ని ఎందుకు సంభాషణలోకి లాగుతున్నారని సిద్ధరామయ్యను ప్రశ్నించారు.
మరోవైపు స్పీకర్ కుర్చీలో కూర్చొని ‘మా ఆర్ఎస్ఎస్’ అని విశ్వేశ్వర్ హెగ్డే అనడాన్ని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్. ఒక స్పీకర్ స్థానంలో ఉండి.. ఇలా మాట్లాడటం సరికాదని నిలదీశారు. దీంతో ‘మా ఆర్ఎస్ఎస్ కాకపోతే మరేమిటి? తప్పకుండా మా ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ మాదే’ అని స్పీకర్ చెప్పారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ‘మా ఆర్ఎస్ఎస్’ అని పిలవవలసి ఉంటుంది" అని జమీర్ నుద్దేశించి అన్నారు.
రెవెన్యూ మంత్రి ఆర్ అశోక మాట్లాడుతూ, ఒకరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ప్రధానమంత్రి మొదలుకొని అన్ని అగ్ర రాజకీయ హోదాలు ఆర్ఎస్ఎస్కు చెందిన నాయకులచే ఆక్రమించబడ్డాయని అన్నారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా త్వరలో ఆర్ఎస్ఎస్లో భాగమవుతారని ఈశ్వరప్ప వివాదాన్ని మరింత పెంచారు. ఆర్ ఎస్ ఎస్ అనేది దేశానికి దురదృష్టమని, ఆగ్రహించిన కాంగ్రెస్ నేతలు కేజే జార్జ్, ప్రియాంక్ ఖర్గే, యూటీ ఖాదర్, అంజలి నింబాల్కర్ తదితరులు ఈ వ్యాఖ్యలను విమర్శించారు. గందరగోళం కొనసాగడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.