
Madhya Pradesh Assembly Election: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. రాబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. భోపాల్ లో మంగళవారం జరిగిన ఆప్ కార్యకర్తల సదస్సులో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆప్ ఇకపై మధ్యప్రదేశ్ ప్రజలకు ప్రత్యామ్నాయం అవుతుందని ఆయన అన్నారు. ఆయన వెంట పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాయనీ, వారి పాలనలో పెద్దగా ప్రజలకు మేలుజరగలేదని పేర్కొంటూ.. ఇప్పుడు ఆప్ ప్రజలకు ప్రత్యామ్నాయంగా మారుతుందని కేజ్రీవాల్ అన్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలబోతున్నదని అన్నారు.
ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మోడీ భయపడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అవినీతి రహిత భారత్ ను నిర్మించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని పేర్కొంటున్నారు. మనీష్ సిసోడియాను జైలుకు పంపిన రోజు దేశ ప్రధాని విద్యావంతులు కావాలని తాను భావించానని చెప్పారు. దేశ ప్రధాని విద్యావంతుడై ఉంటే విద్య ప్రాముఖ్యత తెలిసేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. "మధ్యప్రదేశ్ ప్రజలు ఆప్ కు అవకాశం ఇవ్వండి.. ఉచిత విద్యుత్ ఇస్తాం" అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ లో మన్ సాహెబ్ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు.
"ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఢిల్లీలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో కూడా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తాం. మా ఉద్దేశం స్పష్టంగా ఉంది, ఉద్యోగం ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. అందుకైనా ఆప్ కు అవకాశం ఇవ్వండి. ఇద్దరు తెలివైన మాజీ మంత్రులు సత్యేంద్ర, మనీష్ సిసోడియాలను అరెస్టు చేశారు. కేజ్రీవాల్ పై బురద జల్లుతున్నారు. గతంలో ఈ దేశంలో మత రాజకీయాలు, కులం, బూటకపు రాజకీయాలు ఉండేవని" అన్నారు. అయితే, ఆప్ తన చేతలతో ప్రజలకు పనిచేసి పెట్టే కొత్త రాజకీయం చేస్తోందని తెలిపారు.
ప్రధాని మోడీపై భగవంత్ మాన్ ఫైర్
ఈ బహిరంగ సభలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ మాట్లాడుతూ.. తాను చిన్నప్పుడు రైలులో టీ అమ్మేవాడినని బడే సాహెబ్ చెప్పారు, అయితే, పెరిగి పెద్దయ్యాక ఆ రైలు పట్టాలనే అమ్మేశాడు అంటూ రైల్వే ప్రయివేటీకరణ అంశాలను ప్రస్తావించారు. బీహెచ్ఈఎల్-టెల్, ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా సంస్థల అమ్మకాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఆప్ గురించి సీఎం మాన్ మాట్లాడుతూ. ఎల్జీ ఇబ్బంది పెట్టినా తాము.. ప్రభుత్వాన్ని బాగా నడుపుతున్నామని చెప్పారు. ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇలా ప్రజలకు మేలు చేస్తున్న వారిని జైళ్లో పెడుతున్నారు.. కానీ దేశాన్ని దోచుకుంటున్న వారితో కలిసి విమానాల్లో తిరుగుతున్నారని ప్రధానిపై విమర్శలు గుప్పించారు.