
కరోనా కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయని హెచ్చరించారు ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా. కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కోసం బూస్టర్ డోస్ అవసరమని చెప్పారు. మనలో రోగనిరోధక శక్తి తగ్గితే వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని రణ్దీప్ హెచ్చరించారు.
పిల్లలకు కరోనా టీకాపై భారత్ బయోటెక్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ వరకు రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నారులపై ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు. 2 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని తెలిపారు.
Also Read:దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..!
సెప్టెంబరు చివరి నాటికి భారత్లో చిన్నారులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రణ్దీప్ గులేరియా చెప్పారు. జైడస్ క్యాడిలా తయారు చేసిన టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయ్యాయని... టీకా వినియోగ అనుమతి కోసం డీజీసీఐకి దరఖాస్తు చేసుకుందని చెప్పారు. అలాగే మొదటి, రెండో దశలతో పోల్చితే థర్డ్ వేవ్ అంత ఆందోళనకరంగా ఉండకపోవచ్చునని గులేరియా అన్నారు.