
అహ్మదాబాద్: ‘నేను విద్యకు దూరమైన అఫ్గానిస్తాన్ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తాను. అవకాశమిస్తే ఏ రంగంలోనైనా మహిళలు రాణిస్తారని తాలిబాన్లకు చెప్పాలని అనుకుంటున్నాను’ అని రజియా మురాడి అన్నారు. రజియా మురాడి అఫ్గాన్ దేశస్తురాలు. వీర్ నార్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (వీన్ఎస్జీయూ)లో సోమవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)లో గోల్డ్ మెడల్ సాధించారు.
గత మూడేళ్లుగా ఆమె కుటుంబానికి దూరంగానే ఉండాల్సి వస్తున్నది. ఆమె ఎంఏలో 8.60 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ సాధించారు. ఆ సబ్జెక్టులో అదే హైయెస్ట్ స్కోర్. 2022 ఏప్రిల్లో ఆమె ఎంఏ పూర్తి చేశారు. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆమె పీహెచ్డీ చేస్తున్నారు.
ఆమె అఫ్గాన్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత కరోనా లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ మోడ్లోనే చదువుకుంది. తొలి రెండు సెమిస్టర్లలో క్లాసులు, పరీక్షలు చాలా వరకు ఆన్లైన్లో జరిగిపోయాయి.
తాను రెగ్యులర్గా లెక్చర్లు వినేదని, స్టడీస్ పై ఫోకస్ పెట్టేదని వివరించారు. కరోనా మహమ్మారే కాదు.. తాలిబాన్ల నుంచి కూడా ఆమె డిస్టబ్ కాకుండా ఉన్నారు.
ఆమె ఎంఏ గోల్డ్ మెడల్తోపాటు శారదా అంబేలాల్ దేశాయ్ ప్రైజ్ కూడా పొందారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాలిబాన్లపై విమర్శలు చేశారు. సాధారణ విద్యను పొందకుండా మహిళలు, బాలికలను నిషేధించడం సిగ్గుచేటు అని తాలిబాన్లపై ఫైర్ అయ్యారు. భారత ప్రభుత్వం, ఐసీసీఆర్, వీఎన్ఎస్జీయూలకు, భారత ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏదో ఒక రోజు ఈ యూనివర్సిటీకి తన సేవలు అందించాలని భావిస్తున్నట్టు వివరించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడాలని భావిస్తున్నట్టు తెలిపారు.
తాను గోల్డ్ మెడల్ సాధించడంపై సంతోషంగా ఉన్నారని, అయితే, కుటుంబానికి దూరంగా ఉండటం బాధాకరంగా ఉన్నదని అన్నారు. అయితే, తాను ఫోన్ చేసి వారికి విషయం చెబుతానని, వారు కూడా సంతోషపడతారని వివరించారు.
సుమారు 14 వేల అప్ఘాన్ విద్యార్థులు భారత్లో ఐసీసీఆర్ స్కాలర్షిప్, ఇతర సంస్థల సహకారాలతో చదువుకుంటున్నారు.