
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేర చరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఎన్నికల సంఘాన్ని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల స్థాయిలలోని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల వివరాలను అప్లోడ్ చేయాలని, అది తప్పనిసరని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఏడీఆర్.
రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను, అటువంటి వ్యక్తుల ఎంపికకు గల కారణాలను ప్రచురించడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు వారిని మందలించిందని ఏడీఆర్ ఎత్తి చూపింది. 2023లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. 2022 లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2021 పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రతి ఎన్నికల సమయంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించడంలో విఫలమైన ఆయా పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేర చరిత్రను వెంటనే సుప్రీంకోర్టుకు నివేదించాలని ఎన్నికల సంస్కరణ సంఘాలు పేర్కొన్నాయి. పేర్కొన్న నిబంధనల ఉల్లంఘనకు జరిమానా విధించడాన్ని కూడా కమిషన్ పరిగణించాలని లేఖలో పేర్కొంది.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ఎన్నికల కమిషన్ (EC) జారీ చేసిన నిబంధనల ప్రకారం.. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేర చరిత్ర, నేరాల స్వభావంతో సహా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను కూడా వెబ్ సెట్ లో అప్ లోడ్ చేయాలి. అలాగే .. రాజకీయ పార్టీలు అటువంటి( నేర చరిత్ర కలిగిన)అభ్యర్థులను ఎంపిక చేయడానికి కారణాలు, నేర చరిత్ర లేని ఇతర వ్యక్తులను అభ్యర్థులుగా ఎంపిక చేయలేకపోవడాన్ని గల కారణాలకు కూడా తెలియజేయాలి. ఈ క్రమంలోనే 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించని 10 రాజకీయ పార్టీలకు భారీ జరిమానా విధించింది.