
'ఆప్' కు జాతీయ పార్టీ హోదా : అధికారిక జాతీయ హోదా పొందడంలో జాప్యంపై అరవింద్ కేజ్రీవాల్ నేత్రుత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గురువారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఆప్ కర్ణాటక కన్వీనర్ పృథ్వీ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ పార్టీ హోదా పొందేందుకు ఆప్ అన్ని షరతులను నెరవేరుస్తుందని, అయితే.. జాతీయ పార్టీ హోదా రావడంలో జాప్యం జరుగుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితులలో తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా వస్తే.. ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం ఏం చెప్పింది?
ఇటీవల, ఆప్కి జాతీయ పార్టీ హోదా కల్పించే విషయంపై ఎన్నికల సంఘం సమీక్షిస్తోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. వాస్తవానికి.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి దాదాపు 13 శాతం ఓట్లు , ఐదు సీట్లు వచ్చాయి, ఆ తర్వాత అది జాతీయ పార్టీ హోదాకు చెల్లుబాటు అయింది. అనంతరం పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన కేజ్రీవాల్.. గుజరాత్ ఫలితం మనకు జాతీయ పార్టీ హోదాను కల్పిస్తోందని అన్నారు. పదేళ్ల క్రితం చిన్న పార్టీగా అవతరించిందనీ, నేడు ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారని అన్నారు.
ప్రస్తుతం పంజాబ్, ఢిల్లీలో ఆప్ స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ఆప్ ఆశిస్తుంది. గెలుపుపై ఆప్ దీమా వ్యక్తం చేస్తుంది. కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకు మే 10న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయని, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా ఇక్కడ పోటీ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ల మధ్యే సాగుతుండగా, ఆప్ రాకతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.