Goa Congress: ఎనిమిది మంది గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు బీజేపీలో చేరే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది అసెంబ్లీ స్పీకర్ను కలిశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Goa Congress: గోవాలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ. ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హస్తానికి గుడ్ బై చెప్పనున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రాష్ట్ర మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు బీజేపీలో చేరనున్నట్లు గోవా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చీఫ్ సదానంద్ షెట్ తనవాడే తెలిపారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రస్ బలం 11 నుంచి మూడు తగ్గే అవకాశముంది. వారిలో కాంగ్రెస్ నాయకులు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ ఫాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్లు ఉన్నారు. ఇప్పటికే వారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ను కూడా కలిశారని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.
Goa | 8 Congress MLAs incl Digambar Kamat, Michael Lobo, Delilah Lobo, Rajesh Phaldesai, Kedar Naik, Sankalp Amonkar, Aleixo Sequeira & Rudolf Fernandes to join BJP today; also met with CM Pramod Sawant pic.twitter.com/rAffvBqMzB
— ANI (@ANI)
వివరాల్లోకెళ్తే.. గత కొంత కాలంగా గోవా కాంగ్రెస్ నాయకులు పార్టీ గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు కనిపించిన రెండు నెలల తర్వాత.. ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది బుధవారం నాడు అధికార పార్టీ బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వారు విధానసభ స్పీకర్ను, ముఖ్యమంత్రిని కలిశారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వార్తా సంస్థ పీటీఐ నివేదికల ప్రకారం.. రాష్ట్ర బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగనందున స్పీకర్తో ఎమ్మెల్యేల భేటీ అసాధారణం. ఎజెండాపై ఇంకా స్పష్టత రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూపుగా విడిపోతే - పార్టీ బలంలో మూడింట రెండొంతుల మంది.. అంటే - ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటును తప్పించుకోవచ్చు.
ఈ ఏడాది జులైలో అగ్రనేతలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో సహా కనీసం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కామత్, లోబోలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ స్పీకర్ను కోరింది. ఆ సమయంలో, కాంగ్రెస్ కనీసం ఏడుగురు ఎమ్మెల్యేలను తన వద్ద ఉంచుకోగలిగింది. దీంతో ఇతరుల నుండి తుది కదలిక లేదు. కీలకమైన పార్టీ సమావేశానికి హాజరుకాని నలుగురిలో లోబో, కామత్, కేదార్ నాయక్, లోబో భార్య డెలిలా లోబో ఉన్నారు. ప్రతిపక్ష నేతగా మైఖేల్ లోబోను కాంగ్రెస్ తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి మారారు.