ఆరేళ్ల బాలికపై రేప్: నిందితుడి స్కెచ్ లు విడుదల చేసిన పోలీసులు

By telugu teamFirst Published Aug 10, 2020, 12:28 PM IST
Highlights

ఆరేళ్ల బాలికపై నాలుగు రోజుల క్రితం అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆరేళ్ల బాలికను దుండగుడు కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేశారు. సంఘటన హాపూర్ జిల్లాలో గురువారంనాడు జరిగింది. బాలిక ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితిలో ఉంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

బాలిక తల్లిదండ్రులు, ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మూడు స్కెచ్ లను గీయించి విడుదల చేశారు.  మోటార్ సైకిల్ మీద వచ్చిన ఆగంతకుడు ముక్తేశ్వర్ ప్రాంతంలోని ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. 

బాలిక కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామానికి సమీపంలో మర్నాడు బాలిక రక్తం మడుగులో స్పృహ తప్పి పడిపోయి ఉండడం కనిపించింది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. 

బాలికను వెంటనే మీరట్ లోని ప్రత్యేకమైన ఆస్పత్రికి తరలించారు. ఆమెకు సర్జరీ జరిగింది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే ప్రమాదం తప్పిపోయిందని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. చాలా కాలం ఆమె చికిత్స పొందాల్సి ఉింటుందని, మరిన్ని సర్జరీలు జరగాలని వారు చెబుతున్నారు. 

బాలిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయలేకపోయామని పోలీసులు అంటున్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని, ఆరు పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని చెప్పారు.

click me!