
చెన్నై: తమిళనాడులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని నెల దాటిందో లేదో అప్పుడే వారి కొత్త కాపురం విషాదంలో మునిగింది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ప్రతి రోజు సెల్ఫోన్లలో 50 సార్లు ఐ లవ్ యూ మెస్సేజీలు పెట్టుకునే వారు. కానీ, ఒక రోజు ఉదయం భార్య ఫోన్ చేస్తే భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంతే ఆమె మనసు ముక్కలైంది. తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక సరిగ్గా 12 గంటల తర్వాత భర్త కూడా అదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని పట్టుకొట్టైలో చోటుచేసుకుంది.
28 ఏళ్ల సతీశ్, 22 ఏళ్ల సువిత నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పట్టుకొట్టై నాటుచాల గ్రామానికి చెందిన ఈ దంపతులు ప్రతి రోజూ చాలా సార్లు ఐ లవ్ యూ అని చెప్పుకునేవాళ్లు. ఇంటి నుంచి భర్త దూరంగా వెళ్లినప్పుడు ఫోన్లో ఐ లవ్ యూ మెస్సేజీలు పెట్టుకునేవారు. ప్రతి రోజు కనీసం 50 ఐ లవ్ యూ మెస్సేజీలు చేసుకునేవారు.
కానీ, ఆదివారం ఉదయం సువిత తన భర్త సతీశ్కు ఫోన్ చేసింది. కానీ, సతీశ్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రతి రోజు కనీసం 50 ఐ లవ్ యూ మెస్సేజీలు చేసుకునేవారు.. అలాంటిది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె కలత చెందింది. మనస్తాపంతో మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Also Read: ఈ వారంలో వర్షాలు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్: ఐఎండీ.. రుతుపవనాలు ఎందుకు ఆలస్యమయ్యాయి?
ఈ విషయం తెలియగానే.. సతీశ్ వెంటనే ఆమెను పట్టుకొట్టై ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లాడు. కానీ, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో సతీశ్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం ఆమె మరణించగా.. సోమవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నవ దంపతులు ఇలా తొందరపాటు నిర్ణయాలతో మరణించడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.