
న్యూఢిల్లీ: సూడాన్లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ దేశంలో చిక్కుకున్న భారతీయుల రక్షణపై ఆందోళనలు వెలువడ్డాయి. వారిని ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలనే ఆలోచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి పేరిట అంతర్యుద్ధంతో ఉద్రిక్తంగా మారిన సూడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా మన దేశానికి తీసుకువస్తున్నది. ఈ ఆపరేషన్ కింద సూడాన్ నుంచి బుధవారం సాయంత్రం 360 మంది దేశ రాజధానిలో దిగారు.
సౌదీ అరేబియా ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్లో వారంతా జెడ్డా కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 1.56 గంటలకు బయల్దేరారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు రాత్రి 9 గంటలకు చేరుకున్నారు.
సూడాన్లో చిక్కుకున్న పౌరులను కాపాడటానికి ఆపరేషన్ కావేరీని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. సూడాన్ నుంచి తొలుత భారత పౌరులను సౌదీకి తరలిస్తున్నది. అక్కడి నుంచి భారత్కు తీసుకువస్తున్నది.
ఇప్పటి వరకు కనీసం 534 మంది భారత పౌరులను సూడాన్ నుంచి రక్షించింది.
భారత వైమానిక దళానికి చెందిన రెండు సీ130 జే మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా సూడాన్ పోర్టు నుంచి 256 మంది భారతీయులను బుధవారం జెడ్డాకు తీసుకువచ్చింది. అంతకు ముందటి రోజు భారత నావికా దళానికి చెందిన షిప్లు సూడాన్ నుంచి 278 మంది పౌరులను కాపాడింది.