
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్మహల్లో హిందూ మతానికి చెందిన విగ్రహాలు ఉండొచ్చని కొందరు వాదిస్తున్నారు. తాజ్మహల్లో మూసి ఉంచిన 20 గదులను తెరవాలని, అందులో హిందూ విగ్రహాలు, తాళపత్రాలు పాతిపెట్టబడి ఉన్నాయేమో చూడాలని అలహాబాద్ హైకోర్టును విజ్ఞప్తి చేశారు. 20 గదులను తెరిచి తవ్వకాలు జరపాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ను ఈ మేరకు ఆదేశించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు అయింది. ఇందు కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్ కోరింది. ఆ గదుల్లో హిందూ మూర్తులు, రాతలకు సంబంధించిన ఆధారాలను వెతికి పట్టుకోవడానికి ఈ కమిటీ పని చేయాలని సూచించింది.
అయోధ్య జిల్లా బీజేపీ మీడియా ఇన్చార్జ్ డాక్టర్ రజనీశ్ ఈ విజ్ఞప్తిని సమర్పించారు. ఈ పిటిషన్ విచారణకు వస్తే.. డాక్టర్ రజనీశ్ తరఫున కౌన్సెల్ రుద్ర విక్రమ్ సింగ్ వాదించనున్నారు. తాజ్మహల్ విషయంలో చారిత్రక వివాదం ఒకటి కొనసాగుతూనే ఉన్నదని బీజేపీ లీడర్ డాక్టర్ రజనీశ్ వాదించారు. తాజ్మహల్లో సుమారు 20 గదులు మూసే ఉంచుతున్నారని, ఈ గదుల్లోకి ఒక్కరిని కూడా వెళ్లడానికి అనుమతించరని పేర్కొన్నారు. అయితే, ఈ చాంబర్లలో హిందూ విగ్రహాలు, రాతలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడగట్టనికి ఏఎస్ఐని ఆదేశించాలని తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు వివరించారు. ఈ చాంబర్లను తెరవడం ద్వారా ఏ హానీ జరగదని అన్నారు. కానీ, వీటిని తెరిస్తే ఇప్పటి వరకు చలామనిలో ఉన్న వివాదాలు సమసిపోతాయని తెలిపారు.
2020 సంవత్సరం నుంచి తాను ఈ 20 గదుల గురించి ఆరా తీస్తున్నారని, ఆధారాలను సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రజనీశ్ సింగ్ వివరించారు. సమాచార హక్కు ద్వారా కూడా ఈ విషయాలను కనుగొనడానికి ప్రయత్నించానని తెలిపారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ద్వారా ఈ గదుల్లో ఏముందో తెలుసుకోవడానికి ఆర్టీఐ దాఖలు చేసినట్టు వివరించారు.
తాజ్మహల్ ఒకప్పుడు శివాలయం అని 2015లో ఆరు అటార్నీ సూట్లు దాఖలయ్యాయని తెలిపారు. 2017లో బీజేపీ నేత వినయ్ కతియార్ ఇదే వాదనను పునరుద్ఘాటిస్తూ.. సీఎం యోగి ఆదిత్యా నాథ్ తాజ్మహల్ను సందర్శించి హిందూ గుర్తులను పరిశీలించాలని కోరారు.
ఇదిలా ఉండగా, వారణాసిలోని జ్ఞానవాపి-శృంగర్ గౌరీ కాంప్లెక్స్లోని జ్ఞానవాపి మసీదు సమీపంలో సర్వే, వీడియోగ్రఫీ చేస్తున్న సమయంలో ప్రాచీన కాలం నాటి రెండు స్వస్తిక్ గుర్తులు బయటపడ్డాయి. అవి బాగా రంగు మారిపోయి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ స్వస్తికలు చాలా ఏళ్ల క్రితం చిత్రీకరించి ఉంటారని.. మసకబారినప్పటికీ స్వస్తిక్ గుర్తులు కనిపిస్తున్నాయని సర్వే అధికారులు చెప్పారు. అయితే అక్కడ నిరసనలు చెలరేగడంతో సర్వే ప్రక్రియ అర్దతరంగా నిలిపివేసినట్టుగా అధికారులు తెలిపారు. వివరాలు.. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీకి చెందిన మహిళలు రాఖీ సింగ్, లక్ష్మీదేవి, సీతా సాహు తదితరులు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారణకు స్వీకరించిన వారణాసి జిల్లా కోర్టు వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అడ్వొకేట్ కమిషనర్ను నియమించారు. మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖతో కలిసి వాస్తవాలను గుర్తించేందుకు సర్వే చేయాలని ఆదేశించింది. రంజాన్ తర్వాత సర్వేను ప్రారంభించి.. ఈ నెల 10లోగా పూర్తిచేయాలని సూచించింది. ఈ క్రమంలో శుక్రవారం అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సర్వే బృందం శుక్రవారం ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టడంతో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.